లింకన్ హౌజ్ ధర 750 కోట్లు: ప్రత్యేకత ఏంటీ..?
హైదరాబాద్: దేశ వాణిజ్య నగరమైన ముంబై రియల్టీలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గత వారంలో ఆదిత్య బిర్లా గ్రూపు సంస్ధ ఛైర్మన్ కుమార మంగళం బిర్లా రూ. 425 కోట్లు పెట్టి మలబార్ హిల్స్ ప్రాంతంలోని 'జతియా హౌస్'ను కొనుగోలు చేశారు. భారత దేశ రియల్టీ మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన డీల్.
అయితే తాజాగా దేశంలో పాము కాటుకు విరుగుడు మందులు తయారు చేసే సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా, బిర్లా రికార్డును బద్దలు కొట్టారు. ముంబైలోని సంపన్నుల ప్రాంతం బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి సమీపంలోని ‘లింకన్ హౌస్'ను ఆయన ఏకంగా రూ.750 కోట్లు చెల్లించి మరీ కొనుగోలు చేశారు.
లింకన్ హౌస్ చరిత్ర ఇదీ..!
ముంబైలోని అమెరికా దౌత్య కార్యాలయం 2011 వరకు ‘లింకన్ హౌజ్' అనే ఈ భవనంలోనే ఉండేది. వాంకనేర్ మహారాజు ప్రతాప్సింహజి ఝాలా వాంకనేర్కు చెందిన ఈ భవనాన్ని గతంలో వాంకనేర్ హౌజ్ అనే వారు. 1957లో అమెరికా ఈ భవనాన్ని లీజుకు తీసుకుని లింకన్ హౌజ్ అని పేరు మార్చింది.
తర్వాత వాంకనేర్ మహారాజ తన పన్నుల బకాయిలు చెల్లించేందుకు ఈ రాజ ప్రసాదాన్ని అమెరికాకే అమ్మారు. 2011లో ముంబైలోని బీకేసీ ప్రాంతంలో మరింత విశాలమైన భవంతిలోకి అమెరికా కాన్సులేట్ మారింది. ఖాళీ అయిన లింకన్ హౌస్ ను అప్పటి నుంచీ అమెరికా విక్రయించాలని చూసినా, ఆఫర్ ధర మరీ ఎక్కువగా ఉండటంతో ఈ భవనం ఇప్పటిదాకా అమ్ముడుపోలేదు.
ఈ భవనంపై కనీసం రూ.850 కోట్లయినా రాబట్టాలని అమెరికా భావించినా, మార్కెట్ ఆశాజనకంగా లేని నేపథ్యంలో పూనావాలా ఆఫర్ చేసిన రూ.750 కోట్లకు అమ్మేసింది. ఇక బిర్లా తరహాలోనే పూనావాలా కూడా ఈ భవంతిని తన నివాసంగా మార్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం.