యూఎస్లో రోడ్డు ప్రమాదం: ప్రముఖ భారత ఇన్వెస్టర్ పరాగ్ మృతి
న్యూయార్క్/ముంబై: ప్రముఖ భారత పెట్టుబడిదారుడు పరాగ్ పారిఖ్(61) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. పరాగ్ పారిఖ్ ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (పీపీఎఫ్ఏఎస్) మ్యూచువల్ ఫండ్ అధినేత అయిన పరాగ్.. వారెన్ బఫెట్కు చెందిన బర్క్షైర్ హాత్వే కార్పొరేషన్ షేరు హోల్డర్ల వార్షిక సమావేశానికి హాజరయ్యేందుకు ఇటీవల అమెరికాకు వెళ్లారు.
ఆదివారం ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో అక్కడికక్కడే మరణించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను ముందుగా పసిగట్టే వ్యక్తుల్లో పరాగ్ ఒకరని, ఆయన నుంచి వ్యాపార మెలుకువలు ఎన్నో నేర్చుకున్నానని కేబీసీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జీ ప్రదీప్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
2013లో పీపీఎఫ్ఏఎస్ను ప్రారంభించిన పరాగ్ మార్చి 31 నాటికి కంపెనీ నికర విలువ రూ.572 కోట్ల స్థాయిలో ఉంది. గతంలో ఆయన తన భార్య ఒంటిపై ఉన్న నగలను అమ్మేసి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టారు. ఎన్నో ఒడిదుడులను ఎదుర్కొన్న ఆయన, భారతదేశంలోనే ఒక ప్రముఖ ఇన్వెస్టర్గా ఎదిగారు.
పారిక్ మరణంతో భారతదేశంలో రెండో ప్రముఖ ఇన్వెస్టర్ను కోల్పోయినట్లయింది. గత ఫిబ్రవరి నెలలోనే ప్రముఖ ఇన్వెస్టర్ చంద్రకాంత్ సంపత్(86) కన్నుమూశారు.