"పది రూపాయలుంటే రెండు ప్రాణాలు దక్కేవి"
లక్నో : కడు పేదరికంలో కాలం వెళ్లదీస్తున్న ఆ దంపతులను కేవలం రూ.15 కోసం అత్యంత దారుణంగా హత్య చేశాడో ఓ షాపు యజమాని. గత గురువారం నాడు ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని రూ.15 చెల్లించడంలో జాప్యం చేస్తున్నారన్న కారణంగా.. నడిరోడ్డుపైనే భరత్ సింగ్ అనే దళిత దంపతులను అశోక్ మిశ్రా అనే ఓ షాపు యజమాని గొడ్డలితో నరికి హత్య చేసిన విషయం తెలిసిందే. దంపతులిద్దరు చనిపోవడంతో వారి సంతానమైన ముగ్గురు కొడుకులు అనాథలుగా మారిపోయారు.
రూ.15 కోసం దళిత దంపతుల దారుణ హత్య
కాగా ఘటనపై స్పందించిన భరత్ సింగ్ దంపతుల కుమార్తె మిలాన్ (18) తమ కుటుంబం ఎంత దయనీయ స్థితిలో బతుకుతుందో వివరించింది. హత్య జరిగిన రోజు తన తల్లిదండ్రుల వద్ద ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయని, అయితే వాటితో ఓ చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆకలి తీర్చుకుందామనుకున్నారని.. చివరికి ఖాళీ కడుపుతోనే హత్య గావింపబడ్డారని కన్నీరు మున్నీరైంది మిలాన్.
ఇదిలా ఉంటే మిలాన్ కు ఇప్పటికే వివాహిత కాగా.. తన తల్లిదండ్రుల మరణంతో ముగ్గురు సోదరులు అనాథలుగా మారారని విలపించింది.
ఆరోజు ఏం జరిగింది..?
హత్య జరిగిన గత గురువారం ఉదయం యథావిధిగా కూలీ పనికి బయలుదేరారు భరత్ సింగ్ దంపతులు. అప్పటికీ ఏమి తినకపోవడంతో తమ వద్ద ఉన్న ఐదు రూపాయలతో ఓ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నారు. అయితే అంతకుముందే దాని పక్కనున్న షాపులో రూ.15 బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని బకాయిపడ్డారు.
అయితే అదే షాపుకు వెళితే బాకీ కింద ఉన్న ఐదు రూపాయలను ఎక్కడ లాగేసుకుంటాడోన్న భయంతో పక్క షాపుకు వెళ్లారు ఆ దంపతులు. ఇదే వారి హత్యకు కారణమైంది. తన షాపులో బకాయిపడి పక్క షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కున్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన అశోక్ మిశ్రా దంపతులిద్దరిని గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు.
ఘటనపై స్పందించిన అక్కడి ప్రభుత్వం.. దంపతుల మృతికి నష్టపరిహారంగా ఆ కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించింది.