మతం మారి.. మళ్లీ హిందుత్వంలోకి వచ్చినా వారికి ఎస్సీ హోదానే!
న్యూఢిల్లీ: ఓ క్రిస్టియన్ లేదా ఇతర మతస్తుడు తిరిగి హిందూ మతంలోకి మారితే.. అతను గతంలో దళితుడే అయితే.. అతనికి ఎస్సీ కమ్యూనిటికీ చెందిన అన్ని బెనిఫిట్స్ వర్తిస్తాయని సుప్రీం కోర్టు గురువారం నాడు చెప్పింది! షెడ్యూల్ కులానికి (ఎస్సీ) చెందిన వ్యక్తి మరో మతం తీసుకొని.. ఆ తర్వాత తిరిగి హిందువుగా మారితే అతనిని ఎస్సీ గుర్తించవచ్చునని తెలిపింది.
అతనుగాని, అతని పూర్వీకులు అదే కులానికి చెందిన వారుగా రుజువు చేసుకోగలిగితే వారు ఎస్సీ హోదా పొందవచ్చని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టులోని న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాలగౌడలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
కేరళకు చెందిన కేపీ మను అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం తీర్పు చెప్పింది. వారు కుల ధ్రువీకరణ ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే మూడు నిబంధనలను నెరవేర్చాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజ్యాంగం పేర్కొన్న ఎస్సీ కులస్తుడిగా స్పష్టమైన ఆధారం ఉండాలని పేర్కొంది. తమ తల్లిదండ్రులు, పూర్వీకులు అసలు ఏ మతానికి చెందినవారో దానికి పరివర్తన చెందినట్లు సాక్ష్యాధారాలు ఉండాలనీ, తోటి కులస్తుల అంగీకారమూ ఉండాలనీ పేర్కొంది.