మరో అమానుషం : 'దళిత మహిళతో మూత్రం తాగించి..'
దర్భాంగా : దేశంలో దళితులపై దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గతకొద్ది రోజులుగా తరుచూ వార్తల్లో వినిపిస్తున్న ఈ అంశానికి మరో మరో ఘటన తోడైంది. అత్యంత అమానుషంగా ఓ దళిత మహిళ చేత మూత్రం తాగించిన ఘటన బీహార్ లోని దర్భాంగా జిల్లా పిప్రాలో చోటు చేసుకుంది.
ఊళ్లో చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడడానికి మంత్రాలు చేతబడులే కారణమని.. ఆ మంత్రాలు చేతబడులు ఓ దళిత మహిళే చేస్తుందన్న కారణంతో గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఆమెను తీవ్రంగా కొట్టి.. ఆపై ఆమెతో మూత్రం తాగించారు.
కాగా, విషయం తెలుసుకున్న దర్భాంగ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అంజని కుమార్.. దర్యాప్తు కోసం గ్రామానికి వెళ్లగా.. తీవ్రంగా గాయపడ్డ సదరు బాధితురాలు ఊరినే విడిచి వెళ్లిపోయినట్లు తెలసిందని చెప్పారు. ఇప్పటికే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోన్న క్రమంలో మరో అమానుష ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.