దావూద్ మట్లాడాడు, పవార్కు చెప్పా: జఠ్మలానీ
న్యూఢిల్లీ/కరాచీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తనతో లండన్ లో మాట్లాడాడని ప్రముఖ న్యాయవాది, బీజేపీ సీనియర్ నాయకుడు రాంజెఠ్మలానీ బాంబు పేల్చాడు. భారత్ లో జరిగిన బాంబు పేలుళ్లకు తనకు ఎలాంటి సంబంధం లేదని దావూద్ ఇబ్రహీం తనకు చెప్పాడని అన్నారు.
ఈ విషయం తాను అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవాత్ తో చెప్పానని గుర్తు చేశారు. భారత్ లో జరిగే న్యాయవిచారణకు తానుహాజరు కావడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే తనకు ప్రాణ భయం ఉందని దావూద్ ఇబ్రహీం తనతో అన్నాడని రాంజెఠ్మలానీ వివరించారు.
అయితే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ దావూద్ ఇబ్రహీం ఆఫర్ ను తిరస్కరించారని రాంజెఠ్మలానీ ఆరోపించారు. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది రాంజఠ్మలానీ వ్యాఖ్యలతో అందరూ ఉలిక్కిపడ్డారు.
రాంజెఠ్మలానీ వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. దావూద్ ఇబ్రహీంను వదిలేయాలని రాంజెఠ్మలానీ తనకు చెప్పాడని ఆయన అన్నారు. పలు కేసుల్లో నిందితుడైన దావూద్ను అరెస్టు చేయడానికి అవకాశం వస్తే ఎలా వదులుకుంటామని ఆయన ప్రశ్నించారు.
మేము భారత్ లో అడుగు పెట్టం
ముంబై వరస బాంబు పేలుళ్ల తరువాత తాము భారత్ వస్తామని చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఇప్పుడు పిలిచినా తాము భారత్ లో అడుగు పెట్టబోమని దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు చోట షకీల్ అంటున్నాడు.
కరాచి నుండి అతను ఒక మీడియా చానెల్ తో ఫోన్ లో మట్లాడాడు. మా భయ్యా దావూద్ ఇబ్రహీం భారత్ లో సెటిల్ అయ్యి అక్కడే వ్యాపారం చేయ్యాలని ఆశపడేవాడని అన్నాడు. అయితే అందుకు అవకాశం లేకుండా పోయిందని చెప్పాడు.
చోటా రాజన్ ను తాము హత్య చేయించాలని అనుకోలేదని అన్నాడు. చోటరాజన్ ను భారత్ రప్పించడానికి అక్కడి ప్రభుత్వం (భారత్) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చోట షకీల్ ప్రశ్నించాడు. తమ మీద చూపిస్తున్న శ్రద్ద చోటరాజన్ మీద చూపించాలని చోట షకీల్ డిమాండ్ చేశాడు.