చోటారాజన్ని లేపేసేవాడ్ని:షకీల్, పవార్ స్పందన
న్యూఢిల్లీ: దావూద్ ఇబ్రహీం లొంగిపోతానని చోటా షకీల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కలకలం రేపుతోంది. దీనిపై శరద్ పవార్ స్పందించారు. దావూద్ ఇబ్రహీం భారత్కు తిరిగి రావాలనుకుంటున్న విషయమై రాం జెత్మలానీ తనను సంప్రదించిన మాట నిజమేనని చెప్పాడు.
అయితే అందుకోసం అతను పెట్టిన షరతులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా లేవని శరద్ పవార్ అన్నాడు. 1990 దశకంలో పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దావూద్ ఈ ప్రతిపాదన చేశాడు.
‘దావూద్ భారత్ తిరిగి రావాలకుంటున్న దానిపై రాంజెత్మలానీ ఒక ప్రతిపాదన చేసిన మాట నిజం. అయితే దావూద్ను జైల్లో పెట్టకూడదనే షరతు ఉంది. అది అంగీకారం కాదు. అతను చట్టాన్ని ఎదుర్కొని తీరాలని మేము స్పష్టంగా చెప్పాం' అని పవార్ ఇక్కడ విలేకరులకు చెప్పారు.
దావూద్ ఇబ్రహీం భారత అధికారులకు లొంగిపోవాలనుకున్నాడని, అయితే అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పవార్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారని రాంజెత్మలానీ చేసిన ప్రకటనపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా పవార్ ఈ విషయం చెప్పారు.
తాము వస్తామంటే మీరే వద్దన్నారని దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. తాము వస్తామన్నప్పుడు అంగీకరించలేదని, ఇప్పుడు తిరిగి భారత్ వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పాడు. భారత్లో ప్రభుత్వం మారినప్పుడల్లా మా గురించే మాట్లాడుతారని, మమ్మల్ని భారత్ తెప్పిస్తామంటారని, ఇదేమైనా హల్వానా అన్నాడు.
ఆస్ట్రేలియాలో చోటా రాజన్ తన చేతి నుంచి తప్పించుకున్నాడని చోటా షకీల్ చెప్పాడు. రాజన్ గ్యాంగులోనే ఒకడు తమకు సమాచారం ఇచ్చాడన్నాడు. చోటా రాజన్ అప్పుడు పారిపోయాడని చెప్పాడు. రాజన్ గ్యాంగులోని ముగ్గురు కీలక సభ్యులు మా వైపు వచ్చారన్నాడు.
చోటా రాజన్ హిందూ డాన్ అనే ముద్ర ఉందని ప్రశ్నించినప్పుడు.. ఆయన దేశభక్తుడైతే సైన్యంలో చేర్చుకోవాలని సూచించాడు. షకీల్ కుమార్తె పెళ్లి సందర్భంగా దావూద్ ఇబ్రహీం కాల్చివేత నుండి తృటిలో తప్పించుకున్నాడన్న వార్తపై కస్సుమన్నాడు.