814 శతఘ్నుల కొనుగోలుకు మంత్రి పారికర్ ఆమోదం..!
న్యూఢిల్లీ: రక్షణశాఖ కొత్త మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మనోహర్ పారికర్ నిర్ణయం తీసుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా భారత్లో ఆటకెక్కిన శతఘ్నుల కొనుగోలు వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 15,750 కోట్లతో 814 శతఘ్నులను కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపారు.
అయితే, భారత వైమానిక దళం కోసం 56 ఆవ్రో రవాణా విమానాల తయారీకి టాటా సన్స్-ఎయిర్బస్ సంయుక్తంగా దాఖలు చేసిన ప్రతిపాదనపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతోపాటు రూ 8,200 కోట్లతో స్విట్జర్లాండ్ నుంచి 106 ‘పిలాటస్' మౌలిక శిక్షణ విమానాల కొనుగోలుకు అనుమతి లభించింది.
భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా' పిలుపునకు అనుగుణంగా శతఘ్నులు సమకూర్చుకోవడంలో ‘కొనుగోలు-తయారీ' విధానాన్ని అనుసరించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎంపిక చేసిన కంపెనీ నుంచి 100 శతఘ్నులను నేరుగా కొనుగోలు చేస్తారు.
మిగతా వాటిని సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కింద భారత్లోనే ఉత్పత్తి చేస్తారు. దేశీయ సంస్థలే ఎంపికైతే సొంతంగా లేదా విదేశీ కంపెనీలతో ఒప్పందంతో తయారు చేయవచ్చునని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. 1986లో బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసినప్పటి నుంచి భారత్ శతఘ్నులను కొనుగోలు చేయలేదు.