నకిలీ డిగ్రీ చిక్కుల్లో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి క్రేజీవాల్ కు ఆయన సొంత పార్టీ ఎంఎల్ఏల విద్యార్హత సర్టిఫికెట్లు ఉరితాడుగా మారుతున్నాయి. నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని రోజుకు ఒకరి ఉదంతం బయటకు వస్తుండడంతో ఆప్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ఢిల్లీ శాసన సభ్యురాలు బావనా గౌర్ చేరిపోయారు.
సుమరేంద్రనాథ్ వర్మ అనే ఆర్ టీఐ కార్యాకర్త ఎంఎల్ఏ బావనా గౌర్ నకిలి సర్టిఫికెట్లు సమర్పించారని కోర్టులో పిటిషన్ వేశారు. కేసు వివరాలు తెలుసుకున్న కోర్టు కేసు విచారించడానికి అంగీకరించింది. 2013లో,2015లో రెండు సార్లు బావనా గౌర్ శాసన సభ ఎన్నికలలో పోటి చేశారు.
అయితే 2013లో తాను 12వ తరగతి (ఇంటర్) చదివానని, 2015లో తాను బీఏ, బీఈడీ పూర్తి చేశానని ఎన్నికల అధికారులకు అఫిడివిట్లు సమర్పించారు. ఈ వివరాలు సేకరించిన వర్మ కోర్టును ఆశ్రయించారు. కేవలం 14 నెలల వ్యవధిలో బీఏ, బీఈడీ పూర్తి చెయ్యడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.
రెండు అఫిడివిట్లలో ఏదో ఒకటి తప్పు అయి ఉండాలని అంటున్నారు. ఢిల్లీ కోర్టు కేసు విచారణ వాయిదా వేసింది. నేరం రుజువు అయితే ఎంఎల్ఏ బావనా గౌర్ కు ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
నకిలి సర్టిఫికెట్లు సమర్పించి ఢిల్లీ న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆప్ శాసన సభ్యుడు జితేంద్ర సింగ్ తోమర్ వ్యవహారం సర్ధుమనుగక ముందే ఇప్పుడు మరో శాసన సభ్యురాలి నకిలి సర్టిఫికెట్ల విషయం వెలుగు చూడటంతో ఆప్ నేతల తలలు వేడెక్కిపోయాయి.