ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు కష్టాలు
లక్నో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వారాల్లో అమేథి జిల్లాలోని కోర్టులో లొంగిపోతే ఆయన మీద కఠిన చర్యలు ఉండబోవని హై కోర్టు రూలింగ్ ఇచ్చింది. అమేథి జిల్లాలోని ఓ దిగువ కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద ఓ క్రిమినల్ కేసు పెండింగ్ లో ఉంది.
ఈ కేసులో హాజరు కావాలంటూ ఆ కోర్టు ఈనెల ఆగస్టు 12వ తేదిన ఆదేశాలు జారీ చేస్తు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తు అరవింద్ కేజ్రీవాల్ అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎ.ఎన్. మిట్టల్ నేతృత్వంలోని బెంచ్ అర్జీ విచారణ చేసింది.
అమేథి జ్యడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చెయ్యాలని అరవింద్ కేజ్రీవాల్ తరుపు న్యాయవాది మనవి చేశారు. అదే విధంగా అమేథిలో వ్యక్తిగత హాజరు మినహాయించాలని మనవి చేశారు. అయితే హై కోర్టు అర్జీని డిస్మిస్ చేసింది.
అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వారాల లోపు అమేథి కోర్టు ముందు లోంగిపోయి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారని, చట్టపరంగా కేసు విచారిస్తారని హై కోర్టు చెప్పింది. అమేథి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు అసలెక్కడా లేదని వ్యాఖ్యానించింది.
అసలు ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారని, అయితే అలా స్టే ఇచ్చేందుకు తగిన కారణాలు కోర్టుకు కనిపించలేదని హై కోర్టు తేల్చి చెప్పింది. మొత్తం మీద అరవింద్ కేజ్రీవాల్ నాలుగు వారాలలోపు అమేథి కోర్టు ముందు హాజరుకావలసి ఉంది.