ఇరకాటంలో కేజ్రీవాల్: మంత్రి తోమర్ సర్టిఫికెట్లన్నీ నకిలీవన్న బీహార్ వర్సిటీ...!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇరకాలంలో పడ్డారు. తన మంత్రి వర్గంలోని న్యాయ శాఖ మంత్రి జితేందర్ సింగ్ తోమర్పై వస్తున్న ఆరోపణలే ఇందుకు కారణం. ఢిల్లీ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న జితేందర్ సింగ్ తోమర్ విద్యార్హత సర్టిఫికెట్లన్నీ నకిలీవని బీహార్ విశ్వవిద్యాలయం స్పష్టం చేసింది.
బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో తాను చదివినట్లు మంత్రి తోమర్ సర్టిఫికెట్ చూపించగా, అది నకిలీదని పేర్కొంటూ విశ్వవిద్యాలయం తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. దీంతో తోమర్ విద్యార్హతలేంటని, రికార్డులో ఆయన పేర్కొన్న లా సర్టిఫికెట్ నకిలీదని పేర్కొంటూ ఈ విషయంపై ఆగస్టు 20 లోపు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
తమ విశ్వవిద్యాలయ రికార్డుల్లో తోమర్ పేరు లేదని, ఈ సీరియల్ నెంబర్తో వేరే వ్యక్తి పేరు నమోదై ఉందని విశ్వవిద్యాలయ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో నకిలీ, బోగస్ సర్టిఫికెట్లతో ప్రజలను మోసం చేసిన న్యాయశాఖ మంత్రిని తప్పించాలంటూ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు.
48 ఏళ్ల తోమర్ మొదటి సారి మంత్రి పదవిని చేపట్టారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తోమర్ విద్యార్హతలపై ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉత్తరప్రదేశ్కు చెందిన సైన్సు కాలేజీలో తోమర్ సైన్సు డిగ్రీలో ఉత్తీర్ణుడయ్యానే ఆరోపణలు కూడా వచ్చాయి.
తోమర్పై వచ్చిన ఆరోపణలపై ఆప్ బహిష్కృత నేతలు కూడా మండిపడుతున్నారు. తక్షణమే న్యాయశాఖ మంత్రిని తొలగించకపోతే ఢిల్లీ సచివాలయం ముందు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని ప్రశాంత్ భూషణ్ తదితరులు అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరించారు. ప్రతిపక్షాల ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది.
తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్ కూడా మంత్రి తోమర్ను ఆదేశించారు. తనపై వచ్చిన ఆరోపణలను జితేంద్ర సింగ్ తోమర్ తోసిపుచ్చారు. ఇదొక కల్పిత కేసు. తన సర్టిఫికెట్ వందశాతం నిజమైనదని, రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో స్థానం పొందిన జితేంద్ర సింగ్ తోమర్ ప్రముఖ న్యాయవాది. కేజ్రీవాల్ ఆయనకు కీలకమైన న్యాయ, హోంమంత్రిత్వ శాఖలతో పాటు పర్యాటక, సాంస్కృతిక శాఖలను కూడా అప్పగించారు. తోమర్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. జితేంద్ర సింగ్ తోమర్ త్రినగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికలలో ఆయన నంద్కిషోర్ గర్గ్ని ఓడించారు.
బీహార్లోని తిలక్ మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బి డిగ్రీ పొందారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని, జితేంద్ర సింగ్ తోమర్ ఎన్నికను సవాలుచేస్తూ బీజేపీ నేత నందర్ కిషోర్ గర్గ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తప్పుడు డిగ్రీ సర్ట్ఫికెట్తో న్యాయవాదిగా ఎన్రోల్ చేయించుకున్నట్లు వచ్చిన అభియోగాలపై ఢిల్లీ హైకోర్టు మార్చి 6న ఆయనకు నోటీసులు జారీచేసింది. నామినేషన్ ఫారంతో పాటు సమర్పించిన అఫిడవిట్లో తోమర్ నకిలీ విద్యార్హతలను పేర్కొన్నారని గర్గ్ పిటిషన్లో ఆరోపించారు. నకిలీ విద్యార్హతలను అఫిడవిట్లో పేర్కొన్నందున తోమర్ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.
తోమర్ లా డిగ్రీని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ఫిబ్రవరిలోనే దాఖలైన మరో పిటిషన్పై న్యాయస్థానం ఆదేశాన్నిచ్చింది. నకిలీ డిగ్రీ ఆధారంగా తోమర్ బీహార్లోని బిశ్వంత్సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగ ల్ స్టడీ కాలేజ్లో అడ్మిషన్పొందారని ఈ పిటిషన్ ఆరోపించింది.
ఎల్ఎల్బి కోర్సు అడ్మిషన్ సమయంలో తోమర్ సమర్పించిన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, మార్కుషీటు, రోల్ నంబరు పూర్తిగా నకిలీవని ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్లోని రామ్ మనోహర్లోహియా అవధ్ యూనివర్సిటీ సమాధానం ఇవ్వడంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ ఇటీవల తోమర్కు నోటీసులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.