బీజేపీ గెలిచినా.. ఏఏపీపై ప్రతీకారం: డ్రామా క్వీన్ తప్పుకో.. కేజ్రీపై ఇల్మీ
ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం చేస్తూ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు కార్పోరేషన్లలోను ఆధిక్యం కనబరుస్తూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది.
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజం చేస్తూ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మూడు కార్పోరేషన్లలోను ఆధిక్యం కనబరుస్తూ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. బుధవారం 90 నిమిషాల్లోనే ఓటర్ల తీర్పుపై స్పష్టత వచ్చింది.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడింది. కాంగ్రెస్, ఏఏపీలో ఏ దశలోను బీజేపీకి పోటీని ఇవ్వలేకపోయాయి. 2012లో జరిగిన ఎన్నికల్లోను నార్త్, సౌత్, ఈస్ట్ మొత్తం మూడు కార్పోరేషన్లలో బీజేపీనే గెలిచింది.
ఎగ్జిట్ పోల్: మోడీ హవా, ఢిల్లీలో మూడింట బీజేపీదే గెలుపు, కేజ్రీ ట్వీట్!
ఇదిలా ఉండగా, డ్రామా క్వీన్ అరవింద్ కేజ్రీవాల్ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేత షాజియా ఇల్మీ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఫలితాలు కేజ్రీవాల్ కుట్ర రాజకీయాలకు, నెగిటివ్ రాజకీయాలకు నిదర్శనం అన్నారు.
ఈవీఎంల పైన కేజ్రీవాల్ విమర్శలు చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. ఈవీఎంలను తప్పుబట్టే బదులు, కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని షాజియా డిమాండ్ చేశారు. ఆయన ఓ డ్రామా క్వీన్ అన్నారు. అవాస్తవ కథనాలు అల్లడంలో కేజ్రీవాల్ దిట్ట అన్నారు. కుట్రలు చేయడంలోను దిట్ట అన్నారు. అతను ప్రజలను ఫూల్ చేయలేడన్నారు.
ఢిల్లీలో గెలిచినా సంబరాలకు దూరం
ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించినా తాము వేడుకలు జరుపుకోమని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ అన్నారు. ఇటుల సుకుమా జిల్లాలో మృతి చెందిన సైనికులకు సంతాపంగా ఢిల్లీ విజయంపై బీజేపీ వేడుకలు జరుపుకోవడం లేదన్నారు. 25 మంది సైనికులను మనం పోగొట్టుకున్నామని, దేశం కోసం చేసిన త్యాగాన్ని మనం గౌరవించాలన్నారు.
కేజ్రీవాల్ రాజీనామా చేయాలి
ఢిల్లీ ఫలితాలు తమకు మంచి విజయాన్ని అందించాయని, ఈ విజయాన్ని సీఆర్పీఎఫ్ జవాన్లకు అంకితం ఇస్తున్నామని మనోజ్ తివారీ చెప్పారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోసం ఓటు వేశారన్నారు. ప్రజలు కేజ్రీవాల్ నాయకత్వాన్ని తిరస్కరించారని, ఆయన రాజీనామా చేయాలన్నారు. ఈ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ రెఫరెండంగా భావించాలన్నారు.
బీజేపీ ప్రతీకారం!
ఢిల్లీలో బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రతీకారం తీర్చుకుందని చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఘోర పరాజయం పాలయింది. 70 సీట్లకు గాను కేవలం 3 సీట్లతో సరిపెట్టుకుంది. కానీ ఇప్పుడు 272 మున్సిపల్ స్థానాలకు గాను 270 చోట్ల ఎన్నికలు జరగ్గా.. 185 స్థానాల్లో విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. వరుసగా మూడోసారి మూడు కార్పోరేషన్లు గెలుచుకుంటోంది.
2013లో..
2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు వచ్చాయి. ఏఏపీకి 28 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఏఏపీ అధికారం చేపట్టింది. నాడు బీజేపీకి 33 శాతం, ఏఏపీకి 29.5 శాతం, కాంగ్రెస్ పార్టీకి 24.5 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీతో కలిసేది లేదన్న కేజ్రీవాల్ మాట తప్పారు. అదే పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వత జన్ లోక్పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్.. కేజ్రీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.
ప్రతీకారం తీర్చుకుంది
49 రోజుల పాలన తర్వాత.. కేజ్రీవాల్ 2014లో మోడీపై ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు. అనంతరం 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏఏపీ ఏకంగా 67 స్థానాలు గెలుచుకుంది. బీజేపీకి 2013 కంటే కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తగ్గాయి. కానీ మూడు సీట్లు మాత్రమే గెలిచింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంది.