పక్కనే మహిళపై రేప్: రెండు రోజుల పాటు పార్కులోనే...
పార్కు పక్కన ఈశాన్య రాష్ట్రానికి చెందిన మహిళపై లిప్ట్ ఇస్తానని చెప్పి రేప్ చేశాడు. ఆ తర్వాత రెండు రోజుల పాటు పార్కులోనే ఉన్నాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన హౌజ్ ఖాస్ అత్యాచార కేసు నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అతడు రెండు రోజులుగా పార్కుల్లో గడపుతున్నట్లు తెలిసి అవాక్కయ్యారు. అతన్ని చంద్రవిహార్ ప్రాంత నివాసిగా గుర్తించారు.
దక్షిణ ఢిల్లీకి చెందిన 20 ఏళ్ళ జర్నల్ అలియాస్ రాజు శనివారం అర్థరాత్రి ఓ యువతి పార్టీ నుంచి వస్తుండగా కారులో ఇంటి వద్ద దింపుతానని చెప్పి హౌజ్ ఖాస్ ప్రాంతంలోని పార్కు పక్కన నిర్మానుష్య ప్రదేశంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమె వద్ద ఐఫోన్, డబ్బులు తీసుకుని పారిపోయాడు.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఉదయం పార్కులో నిద్రిస్తున్న రాజును అదుపులోకి తీసుకున్నారు. యువతిపై అత్యాచారానికి పాల్పడినప్పుడు ధరించిన దుస్తుల్లోనే నిందితుడు పట్టుబడడం విశేషం.
రెండు రోజులుగా ఇంటికి వెళ్ళకుండా సమీపంలోని పార్కుల్లో గడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బాధితురాలికి చెందిన ఐఫోన్, కొంత నగదును అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 25న ఐడెంటిఫికేషన్ పెరేడ్ నిర్వహిస్తారు.