1500 మంది పిల్లలు కిడ్నాప్! అసలెక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తున్నారు?
ఢిల్లీలో పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే.. బయటికెళ్లిన లేదా బడికెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా పోతోంది.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించేందుకు తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎందుకంటే.. బయటికెళ్లిన లేదా బడికెళ్లిన పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగొస్తారన్న నమ్మకం లేకుండా పోతోంది. కారణం పిల్లలు అదృశ్యం అవుతుండడమే.
ఢిల్లీలో రోజుకు 12 నుంచి 15 మంది పిల్లలు అదృశ్యమవుతున్నారు. ఇలా ఐదు నెలల కాలంలో 1500 మంది పిల్లలు అదృశ్యమైనట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. హైటెక్ పోలీసు వ్యవస్థకు తోడు వీధి వీధినా సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసినా కిడ్నాప్ లు మాత్రం ఆగడం లేదు.
అదృశ్యమైన పిల్లల్లో కేవలం 60 శాతం మంది మాత్రమే తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. వారిలో కూడా ఎక్కవ మంది తమంతట తామే కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకుని వచ్చిన వారే. అవుటర్ ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా పిల్లల కిడ్నాప్ లు జరుగుతున్నట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజన్ భగత్ తెలిపారు.
ఢిల్లీ నగరానికి వలస వచ్చిన పేద ప్రజల పిల్లలే కిడ్నాప్ లకు గురువుతున్నారని, వారి తల్లిదండ్రుల వద్ద కనీసం ఆ పిల్లల ఫొటోలు కూడా ఉండడం లేదని భగత్ చెప్పారు. పిల్లల కిడ్నాప్ లను అరికట్టేందుకు 'పెహచాన్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. దీని కింద రోడ్లపై కనిపించే పిల్లల ఫొటోలను తీసి భద్రపరుస్తున్నారు.
ఇలా కిడ్నాప్ కు గురైన పిల్లల్లో ఎక్కువ మందిని దేశంలోని పెద్ద నగరాలు, గాల్ఫ్ దేశాలకు వెట్టి చాకిరీ కోసం అమ్మేస్తున్నారని, బాలికలైతే వ్యభిచారంలోకి దించుతున్నారని పోలీసులు తెలిపారు.
మారుమూల గ్రామాల్లో నడి వయస్కులకు పెళ్లి చేయడానికి కూడా బాలికలను అమ్మేస్తున్నారట. ఇలా అదృశ్యమైన పిల్లల జాడ కనుగొనేందుకు తమ వంతు సహకారం అందించాలని సోషల్ మీడియా, స్వచ్ఛంద సంస్థలను పోలీసులు కోరుతున్నారు.