ఢిల్లీలో ప్రిన్సిపల్ కూతురు ఆత్మహత్య, బెంగళూర్లో రేప్
ఢిల్లీ/బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలో విషాద సంఘటన జరిగింది. ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఢిల్లీలోని ఓ పబ్లిక్ స్కూలు ప్రిన్సిపల్ కూతురు మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందింది. ఆమె వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
యువతి తన ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు బుధవారం తెలిపారు. మృతురాలి పేరు అంజన సైనీ. ఆమె వయస్సు 29. వీరి నివాసం పాఠశాల ఉన్న క్యాంపస్లోనే ఉంటుంది. కాగా, గూర్గావ్లో పని చేస్తున్న అంజన సైనీ కొద్ది రోజులుగా డిప్రెషన్లో ఉన్నారని తెలుస్తోంది.
బెంగళూరులో అత్యాచారం
కర్నాటక రాజధాని బెంగళూరులో మరోసారి దారుణం వెలుగు చూసింది. మూడేళ్ల బాలిక పైన పాఠశాలలో అత్యాచారం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ పాఠశాలలో చిన్నారి పైన అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
ప్రైవేటు పాఠశాలలో జరిగిన ఈ దారుణం పైన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పాపను స్కూలు నుంచి ఇంటికి తీసుకురావడానికి వెళ్లినప్పుడు, తాను ఏడుస్తూ ఉందని తనను ఎవరో కొట్టారని చెప్పిందని ఫిర్యాదులో తెలిపాడు. అయితే, ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పిందని పేర్కొన్నాడు.
ఈ ఘటనపై పోలీసులు పోస్కో చట్టంతో పాటు, ఐపీసీ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు స్కూలులోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నారు. పాఠశాల సిబ్బంది అందరినీ ప్రశ్నించారు.
ఆరుగురు ఉల్ఫా ఉగ్రవాదుల అరెస్ట్
ఆరుగురు ఉల్ఫా మిలిటెంట్లను గత రాత్రి సైన్యం అదుపులోకి తీసుకుంది. మేఘాలయలోని గోల్పారాలో వీరిని అరెస్ట్ చేసింది. వీరి వద్ద నుంచి 6 పిస్టళ్లు, హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.