మైనర్ల చేతిలో..?: దూసుకొచ్చిన కారు, ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ఢిల్లీ: తల్లిదండ్రుల నిర్లక్ష్యం, మైనర్ల దుందుడుకు వైఖరితో రోడ్లపై వెళుతున్న అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. తరచూ పోలీసు అధికారులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచనలు చేస్తున్నప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. దీంతో రహదారులపై ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి.
ఇటీవల కాలంలో గమనిస్తే మైనర్లు వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కాశ్మీరీ గేట్ సమీపంలో ఓ కారు ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ఇద్దరు మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనాన్ని నడిపింది ఓ మైనర్ అని ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ సమీపంలో గురువారం ఉదయం ఈ రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, డ్రైవర్ సహా కారులో ఉన్నవారంతా మైనర్లని ప్రాథమిక విచారణలో తెలిసింది. 12వ తరగతి పరీక్షలు పూర్తయిన సంతోషంలో పార్టీ చేసుకుని వారంతా కారులో తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.