మళ్లీ నోట్ల రద్దు? రూ.2000 నోటుపై వేటు నిజమా? లేక ఊహాగానమా?
కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్ల రద్దును చేపట్టబోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రూ.2000 నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు సర్వత్రా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి నోట్ల రద్దును చేపట్టబోతుందా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రూ.2000 నోట్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు సర్వత్రా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి పార్లమెంట్ దాకా వెళ్లింది.
కొత్త రూ.2000 నోట్లను రద్దు చేయాలని నిర్ణయించారా? అంటూ విపక్షాలు సైతం బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రశ్నలు సంధించాయి. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన కానరాలేదు. కనీసం దీనిపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. దీనిని బట్టి చూస్తే.. సమీప భవిష్యత్తులో మరోసారి కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేపట్టడానికి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత నవంబర్ నెల మొదట్లో ప్రభుత్వం హఠాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా చలామణిలో ఉన్న పెద్ద నోట్లు రూ.1000, రూ.500 అన్నీ నిరూపయోగంగా మారిపోయాయి.
ఈ రద్దు అనంతరం కొత్తగా రూ.2000 నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎక్కువగా రూ.2000 నోట్లనే ఆర్బీఐ చలామణిలోకి తేవడంతో, చిన్న నోట్ల సమస్య ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలయ్యారు. ఈ ఇక్కట్లను తీర్చడానికి ఆర్బీఐ తాజాగా కొత్త రూ.200 నోట్లు తీసుకొస్తోంది.
ఇటీవల రూ.2000 కరెన్సీ నోట్ల సరఫరాను కూడా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆపివేసింది. బయట మార్కెట్ లో చలామణిలో ఉన్న నోట్లే బ్యాంకుల వద్దకు వస్తున్నట్టు బ్యాంకు అధికారులు సైతం చెబుతున్నారు.
అంతేకాదు, రూ.2000 నోట్ల ప్రింటింగ్ను కూడా ఆర్బీఐ నిలిపివేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐదు నెలల క్రితం నుంచే ఈ నోట్ల ముద్రణ నిలిచిపోయిందంట. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక కొత్త రూ.2000 నోట్లను ముద్రించడకూడదని కూడా నిర్ణయించిందట.
రూ.2000 నోట్ల ప్రింటింగ్ను ఆపివేసి, కొత్తగా రూ.200 నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభుత్వం నోట్లరద్దు చేపట్టబోతుందనే వార్తలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
మరోవైపు రూ.200 నోట్లను చలామణిలోకి తెస్తుండటంతో పాటు, కొత్త రూ.500 నోట్లు మార్కెట్లో లభ్యమవుతుండటంతో.. రూ.2000 నోట్లు రద్దు చేసినా అంత పెద్ద ప్రభావమేమీ ఉండదని తెలుస్తోంది. అంతగా ప్రభావం అంటూ పడితే.. అది బ్లాక్మనీ రూపంలో రూ.2000 నోట్లను కలిగి ఉన్నవారిపైనే అని చెప్పుకుంటున్నారు.