కరెన్సీ రద్దు, మోడీకి 'మమత' షాక్, ఏకమౌతున్నారు
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై యుద్ధానికి విపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఏఏపీ, ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్ సన్నద్ధమవుతున్నాయి. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు విపక్షాలు భేటీ కానున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ప్రణాళిక లేకుండా నోట్లను రద్దు చేసి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. మోడీ ప్రజల మద్దతు కోల్పోతున్నారని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు.
అప్పుడే ఈ ఉపాయం వచ్చింది, అసలు ఆ డబ్బెక్కడ?: కరెన్సీ రద్దుపై మోడీ
ఘాజీపూర్లోని ప్రధాని మోడీ ర్యాలీ చప్పగా సాగిందన్నారు. నోట్ల రద్దు ఎఫెక్ట్ దాని పైన పడిందని చెపల్పారు. ఓ వైపు అవినీతిని అంతమొందిద్దామని ప్రధాని మోడీ చెబుతున్నారని, మరోవైపు బీజేపీ నాయకులు రైలు టిక్కెట్ లేకుండా ప్రధాని ర్యాలీకి ప్రజలను తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు.
దేశంలో నల్లధనాన్ని నివారించేందుకు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్న ప్రతిపక్షాలు.. ఈ నిర్ణయం కేవలం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు మాత్రమే తీసుకున్నారని ఆరోపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోనుల్లో మంతనాలు చేస్తున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేందుకు ఆమె పార్టీల మద్దతు కూడగడుతున్నారు.
ఈ మేరకు పలు ప్రతిపక్ష పార్టీ నేతలకు ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. మమతా బెనర్జీ మంగళవారం ఢిల్లీ చేరుకుంటారని, అక్కడ వివిధ పార్టీలకు చెందిన 100 మంది పార్లమెంటు సభ్యులతో బుధవారం పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తారని తృణమూల్ వర్గాలు తెలిపాయి.
ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై నోట్ల రద్దు వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.