'నోట్ల రద్దుతో ప్రజల కష్టాలు, అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ'
రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం వచ్చిన ఇబ్బందులను, కష్టాలను ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు శుక్రవారం అన్నారు.
నల్గొండ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం వచ్చిన ఇబ్బందులను, కష్టాలను ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు శుక్రవారం అన్నారు. రెండు నెలల్లో కరెన్సీ కష్టాలు తీరుతాయని చెప్పారు.
నోట్ల రద్దు వల్ల నల్ల ధనంతో పాటు నకిలీ నోట్లు చెలామణిలో లేకుండా పోయాయని చెప్పారు. బంగారం, భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు.
నల్ల ధనం పైన డిసెంబర్ 16వ తేదీ తర్వాత తాము ప్రజలలోకి వెళ్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక నల్లధనం కలిగిన దేశం మనదేనని చెప్పారు. నల్ల ధనానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మండపడ్డారు.
క్యాష్ లెస్ పైన ప్రచారం ప్రారంభం
రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ప్రజలను క్యాష్ లెస్ విధానానికి మళ్లించేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (టీటా) చొరవ చూపుతోంది.
ఇందుకోసం ప్రచార కార్యక్రమం-డిజిథాన్ను అసోసియేషన్ చేపట్టింది. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, మీ సేవ కమిషనర్ వెంకటేశ్వర రావు గురువారం ప్రారంభించారు. రాష్ట్రంలో డిజిటల్ లావాదేవీల పైన అవగాహన కల్పిస్తారు.