ఆరోపణలు రుజువైతే తల నరకండి: డేరా సచ్చా సౌదా చీఫ్
న్యూఢిల్లీ: తన ఆశ్రమంలో నపుంసకత్వ ఆపరేషన్లను ప్రోత్సహిస్తున్నానని తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే బహిరంగ శిరచ్చేధన శిక్షకు సిద్ధమని డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రహీమ్ సింగ్ ఆదివారం అన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ "ఈ ఆరోపణలు నూటికి నూరుశాతం తప్పు. నేను ఎవరినీ అలా చేయాలని కోరలేదు. సత్సంగ్లో లేదా మరెక్కడైనా ఎవరితోనైనా అలా మాట్లాడినట్లు నిరూపిస్తే నా తల నరికించుకోవడానికి సిద్ధం" అని ఆయన తెలిపారు. ఇంతకన్నా తాను ఇంకేమీ చెప్పలేనని అన్నారు
గతంలో డేరా అనుచరుడిగా ఉన్న హన్స్ రాజ్ చౌహాన్ అనే వ్యక్తి ఆశ్రమంలో పురుషులను నపుంసకులుగా మార్చే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని, తనతో పాటు మరో 400 మందికి ఆపరేషన్ లు జరిగాయని ఆరోపిస్తూ పంజాబ్ అండ్ హర్యానా కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు ఈ విషయంపై డిసెంబర్ 23న సీబీఐ విచారణ జరిపించాలని ఆదేశించింది.
మరో ప్రశ్నకు గాను నపుంసకులు లాంటి వ్యక్తులను దేవుడు పంపిస్తాడు. వాళ్లు దేవుడిచ్చిన బహుమతులే కాని మనం ఇక్కడ తయారుచేయలేమని చెప్పాడు. ఇక ఆశ్రమంలో సెక్యూరిటీ విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. సుమారు ఐదు కోట్ల మంది భక్తులను తాగుడు మాన్పించడంలో సక్సెస్ అయ్యామని తెలిపారు.