రాహుల్కు మళ్లీ మళ్లీ అదే చెబుతున్నా!, కావాల్సింది వినూత్న కాంగ్రెస్: దిగ్విజయ్
తమకు పూర్తిస్థాయిలో నూతన కాంగ్రెస్ కావాలని, పార్టీలో వినూత్న రాజకీయ వాతావరణం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కొత్త ప్రణాళిక, నూతన మార్గ సూచి, వినూత్న శైలి ప్రచారం కావాలని చెప్పారు.
న్యూఢిల్లీ: గోవాలో అధికారం చేజారడంతో ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ నిలిచినప్పటికీ.. దిగ్విజయ్ సింగ్ వైఫల్యం వల్ల కాంగ్రెస్ అధికారానికి దూరమైంది ఇటీవల గోవా కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు సైతం ఆరోపించారు.
తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిగ్విజయ్ సింగ్ దీనిపై స్పందించారు. తమకు పూర్తిస్థాయిలో నూతన కాంగ్రెస్ కావాలని, పార్టీలో వినూత్న రాజకీయ వాతావరణం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఇందుకోసం కొత్త ప్రణాళిక, నూతన మార్గ సూచి, వినూత్న శైలి ప్రచారం కావాలని చెప్పారు.
అయితే ఈ బాధ్యతలు రాహుల్ నిర్వర్తించాలన్నారు. రాహుల్ దృఢ నిశ్చయంతో పని చేయడం లేదన్నదే తన ఫిర్యాదు అని తెలిపారు. ఇదే విషయాన్ని రాహుల్ కు పలుమార్లు చెప్పానని, మళ్లీ మళ్లీ ఇదే చెప్తున్నానని దిగ్విజయ్ స్పష్టం చేశారు. మధ్యతరగతి ప్రజల్లోకి చొచ్చుకెళ్లేలా, ఆధునిక మార్పులకు అనుగుణంగా పార్టీని తీర్చిదిద్దాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ పని రాహుల్ గాంధీ, అధిష్టానమే చేయాలని సూచించారు.