జయను కీర్తిస్తూ డిఎంకె కార్యకర్తల ఫ్లెక్సీల ఏర్పాటు,కొత్త సంప్రదాయాలను పాటిద్దాం
తమిళనాడులో అన్నా డిఎంకె అధినేత్రి జయలలితను కీర్తిస్తూ డిఎంకె కార్యకర్తలు మెరీనా బీచ్ లో ఏర్పాటుచేసిన ప్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. జయను పొగుడుతూ వారు ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో డిఎంకె, అన్నా డిఎంకె పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాని, జయలలితను కీర్తిస్తూ డిఎంకె కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ అన్నాడిఎంకె కార్యకర్తలను షాక్ కు గురిచేసింది. జయలలితను ఖననం చేసిన మేరీనా బీచ్ లో డిఎంకె కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో డిఎంకె, అన్నా డిఎంకె కార్యకర్తల మద్య తీవ్రస్థాయిలో విభేధాలు ఉండేవి. ఈ రెండు పార్టీల కార్యకర్తలు తమ పార్టీలు అధికారంలోకి రావాలని, తమ నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చేలా వ్యవహారిస్తారు. కాని, జయ మరణంతో డిఎంకె పార్టీ కార్యకర్తలు ఆమె కీర్తిస్తూ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ మాత్రం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరు లేరు. . వేలాది మంది నాయకులు మాతో ఢీకొట్టేందుకు సిద్దంగా ఉన్నా, వారిలో ఒక్కరు కూడ మీలాంటి యోధురాలికి సాటిరాగలరా అని ఆ ఫ్లెక్సీలో డిఎంకె కార్యకర్తలు తమిళంలో రాశారు. అంతేకాదు రాజకీయ సంగ్రామంలో మీరున్నప్పుడు కరుణానిధి ( మా కమాండర్ ఇన్ చీఫ్ ), స్టాలిన్ (జనరల్ ) ఏం చేయలేకపోయారని వారు రాశారు.
మంచి మనసుతో మీరు అందరి మనసులు గెలుచుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని వారు రాశారు. జయలలిత పార్థీవ దేహం వద్ద డిఎంకె నాయకుడు స్టాలిన్ శ్రద్దాంజలి ఘటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డిఎంకె చీఫ్ కరుణానిధి కూడ ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.గతాన్ని సమాధిచేసి కొత్త సంప్రదాయంలో సాగుతామని డిఎంకె ప్రకటించింది.