నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు: అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన కరుణానిధి
చెన్నై: ‘నా లాంటి వికలాంగులకు ఇక్కడ చోటు లేదు' అని ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకె అధినేత ఎం కరుణానిధి, గురువారం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఈ మాజీ ముఖ్యమంత్రి తన హాజరును గుర్తు చేస్తూ సభను విడిచి వెళ్లిపోయారు.
‘నా లాంటి వికలాంగులకు ఈ అసెంబ్లీలో చోటు లేదు. సభలో అధికార పక్షం వ్యవహరించిన తీరును నిరసిస్తూ తాను సభను విడిచి వెళుతున్నాను' అని కరుణానిధి పేర్కొన్నారు.
‘నేను 50ఏళ్ల నుంచి శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నాను. నేను ఈ రోజు సేవ చేయలేకపోతున్నా. నేను ఇలాంటి అగౌరవాన్ని ఇక్కడ ఊహించలేదు' అని పేర్కొంటూ 90ఏళ్ల కరుణానిధి సభ నుంచి వెళ్లిపోయారు.
తాను చక్రాల కుర్చీకే పరిమితమైనందున శాసనసభలో తనకు ప్రత్యేకమైన కుర్చీని ఏర్పాటు చేస్తారని ఆశించినట్లు కరుణానిధి తెలిపారు. కాగా, 2008 నుంచి ఆయన విద్యుత్తో నడిచే చక్రాల కుర్చీని ఉపయోగిస్తున్నారు.