వాజ్పేయికి నేనంటే ఎంతో ప్రేమ, వారిద్దరికి కూడా భారతరత్న: కరుణానిధి
చెన్నై: మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడంపై డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని అన్నారు.
ఐతే, పెరియార్గా పాపులర్ అయిన ద్రవిడ నాయకుడు ఈవీ రామస్వామి, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురైకు భారతరత్న ఇవ్వాలని కరుణానిధి డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను ఆగస్టు 24న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
మరోసారి ఈ విషయమై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. తనపై వాజ్పేయి ఎంతో ప్రేమ చూపించేవారని తెలిపారు. మాజీ ప్రధాని వాజ్పేయితో పాటు పండిట్ మదన్ మోహన్ మాలవ్యాకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుని ప్రకటించింది. కాగా, పండిట్ మదన్ మోహన్ మాలవ్యా పేరుని ప్రస్తావించకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకున్న నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
భారత రత్నపై కేసీఆర్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదులో స్పందించారు. వాజపేయి, మాలవ్యాలకు భారతరత్న ఇవ్వడం సముచితమే అన్నారు. అలాగే, దివంగత నేత, తెలంగాణ కాంగ్రెస్ నేత పీవీ నర్సింహా రావుకు కూడా భారతరత్న పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వక పోవడం వెలితిగా ఉందన్నారు.