వ్యూహం మార్చిన స్టాలిన్: పన్నీరుకు డీఎంకే జత, పళనికి చిక్కు, బుజ్జగింపు
తమిళనాట ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలో పట్టు కోసం శశికళ వర్గం - పన్నీరు సెల్వం వర్గాలు ఓ వైపు కత్తులు దూసుకుంటుండగా.. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఎన్నికలు లేదా
చెన్నై: తమిళనాట ముఖ్యమంత్రి పళనిస్వామి బలనిరూపణ పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీలో పట్టు కోసం శశికళ వర్గం - పన్నీరు సెల్వం వర్గాలు ఓ వైపు కత్తులు దూసుకుంటుండగా.. మరోవైపు ప్రతిపక్ష డీఎంకే ఎన్నికలు లేదా ప్రభుత్వ ఏర్పాటు కోసం కాచుక్కూచుంది. దీంతో శనివారం నాడు జరగనున్న ఫ్లోర్ టెస్ట్ ఉత్కంఠగా కనిపిస్తోంది.
ఓ వైపు పన్నీరు సెల్వం వర్గం శశికళ వర్గీయుడైన... పళనిస్వామి (ముఖ్యమంత్రి)ని నెగ్గకుండా చేసేందుకు పావులు కదుపుతోంది. పన్నీరుకు ఎలాగూ ఎమ్మెల్యేల మద్దతు లేదు. కనీసం శశికళ పైన పైచేయి కోసం ఫళనిస్వామిని ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 11 మంది పన్నీరు వైపు ఉన్నారు. 123 మంది ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామి వైపు ఉన్నారు. డీఎంకేకు 88 మంది, కాంగ్రెస్ పార్టీకి 8 మంది, మరో ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. డీఎంకే, కాంగ్రెస్, పన్నీరు వర్గం, ఇతర పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కలిస్తే 108 (88+8+1+11) మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా అవుతారు.
శశికళ సహా వారిపై వేటు
ఇందులో భాగంగా, పన్నీరు సెల్వం వర్గం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే క్రిమినల్ కేసులు, జయలలితకు ఇచ్చిన మాటను అమలు చేయలేదని చెబుతూ... శశికళ, దివాకరన్, వెంకటేషన్లను పదవుల నుంచి తొలగిస్తూ.. పన్నీరు వర్గం నేత, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటన జారీ చేశారు.
శశికళక వర్గానికి కంటిమీద కునుకు లేకుండా...
ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ అంతటితో ఆగలేదు. శశికళ వర్గానికి కంటిమీద కునుకు లేకుండా చేసేందుకు పన్నీరు వర్గం ప్రయత్నాలు చేస్తోంది. శశికళ, దినకరన్, వెంకటేషన్లతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి, మంత్రివర్గ సహచరులను సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలు సిసలైన అన్నాడీఎంకే పార్టీ తమదే అని చెబుతున్నారు.
పళనిస్వామికి షాక్.. డీఎంకే సంచలనం
శనివారం జరగనున్న విశ్వాస పరీక్ష సమయంలో ఎటూ ఉండకూడదని ప్రతిపక్ష డీఎంకే తొలుత భావించింది. కానీ శుక్రవారం నాడు భేటీ అయిన డిఎంకే అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫ్లోర్ టెస్టును బహిష్కరిస్తామని ఉదయం ప్రకటించింది. కానీ సాయంత్రం భేటీలో మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించింది.
వ్యూహం మార్చిన డిఎంకే.. పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు
డీఎంకే ఒక్కసారిగా వ్యూహం మార్చడంతో శశికళ వర్గీయుడైన ముఖ్యమంత్రి పళనిస్వామి చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. తొలుత మౌనంగా ఉండాలని డీఎంకే భావించింది. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కేవలం పన్నీరు సెల్వం వర్గీయులైన పది పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే.
మరికొందరిని లాక్కుంటే..
కానీ ఇప్పుడు డీఎంకే పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పడంతో వ్యతిరేక ఓటు బలం పెరిగింది. డిఎంకే, పన్నీరు వర్గం, ఇతర ఎమ్మెల్యేలు కలిసి వ్యతిరేక ఓటు 108కి చేరింది. కాంగ్రెస్ నిర్ణయించుకోవాల్సి ఉంది. మరో పదిమంది కలిసి వస్తే.. పళనిస్వామికి చుక్కలే అని చెప్పవచ్చు. ప్రభుత్వం నిలబడాలంటే పళనిస్వామికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ తన వర్గం నుంచి పన్నీరు సెల్వం.. మరో పది మందిని పన్నీరు సెల్వం లాక్కుంటే.. పళనిస్వామి ఫ్లోర్ టెస్టులో ఓడిపోతారు.
ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పళని ప్రయత్నం
ప్రతిపక్ష డీఎంకే, పన్నీరు సెల్వం వర్గం ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు.. మరికొందరు ఎమ్మెల్యేలు కలిస్తే ప్రభుత్వం నిలబడే అవకాశం లేదు. పళనిస్వామి పైన ఉన్న వ్యతిరేకతతో డీఎంకే.. ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించింది. తనకు వ్యతిరేకంగా డీఎంకే, పన్నీరు వర్గం పావులు కదుపుతుండటంతో.. తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను పళనిస్వామి బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నారు. రిసార్టులో ఉన్న ఎవరు కూడా గోడ దాటకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, పళనిని దెబ్బతీసేందుకు.. మరోసారి డీఎంకే, పన్నీరు వర్గం ఏకమవుతోందా అనే చర్చ కూడా సాగుతోంది.