పుకార్లు నమ్ముద్దు: జయ కోసం చైన్నైకి వచ్చిన లండన్ వైద్యులు
చెన్నై: గత పది రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జయలలితను పరీక్షించేందుకు గాను విదేశీ వైద్యులు చెన్నైకి చేరుకున్నారు. లండన్కు చెందిన ప్రముఖ వైద్యుడు రిచర్డ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
లండన్లోని బ్రిడ్జి ఆసుపత్రికి చెందిన రిచర్డ్ జాన్ బీలే జయలలిత ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. ఆపోలో ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి మరో రెండు రోజుల పాటు ఆయన అందుబాటులో ఉంటారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ధ భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
అపోలో ఆసుపత్రి పరిధిలో సుమారు వెయ్యి మందికి పైగా పోలీసులు మెహరించారు. గత రెండు రోజులుగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ను అపోలో వైద్య బృందం విడుదల చేయకపోవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, జయ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఇదిలా ఉంటే ఈరోజు సాయంత్రానికి జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పార్టీకి చెందిన స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్నారు.
అయితే జయలలితి ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుండా ఉండేందుకు తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసులను మోహరించారు.
అమ్మ ఆరోగ్యం బాగాననే ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలు ఎలాంటి ఆవేశానికి లోను కావద్దంటూ పార్టీ నేతలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలని డీఎంకే అధినేత కరుణానిధి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ లేదా ఫొటోలు విడుదల చేయాలన్నారు.
జయలలిత, తన భావజాలం వేరైనా ఆమె కోలుకొని సీఎం విధులు నిర్వహించాలని ఆశిస్తున్నానని శుక్రవారం చెన్నైలో పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశామని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి తెలిపారు.