నిరాశ వద్దు, మోడీకి అండగా ఉండండి: రతన్ టాటా
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పనితీరుపై తొందరపడి నిరాశకు లోనుకావద్దని పారిశ్రామికవేత్తలకు వ్యాపార దిగ్గజం రతన్టాటా హితవు పలికారు. వాగ్దానాలను నెరవేర్చే విషయంలో ప్రధాని మోడీకి దన్నుగా నిలబడటంతోపాటు ఆయను అవకాశాలను ఇవ్వాలని ఆయన సూచించారు.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాలేదు, ఇది కొత్త ప్రభుత్వం, ఇంతతొందరగా ప్రభుత్వంపై మనం అసంతృప్తి పెంచుకోవడం, నిరాశ, నిస్పృహలకు లోనుకావడం సరికాదని ఆయన చెప్పారు.
హెచ్డిఎఫ్సి చైర్మన్ దీపక్ పరేఖ్, మారికో గ్రూప్ హర్ష్ మారివాలా, సిఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్తో సహా పలువురు సిఈఓలో అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు కొద్దిరోజులుగా ప్రభుత్వ పనితీరుపై నిరాశను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రతన్ టాటా పై విధంగా స్పందించారు.
'మనమందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇది కొత్త ప్రభుత్వం. భ్రమలు తొలిగిపోయాయని భావించకూడదు. అంత త్వరగా అసంతృప్తికి లోను కాకూడదు' అని టాటా పేర్కొన్నారు. 'మోడీ స్ఫూర్తివంతమైన నాయకత్వంపై భారీ స్థాయిలో ఆశలున్నాయి. సరికొత్త భారతాన్ని సృష్టించే పనిలో ఆయన ఇంకా తొలి దశలోనే ఉన్నారు. దాని అమలు ఇంకా ఈ ఏడాది రూపుదిద్దుకోలేదు. ఆయన చేసిన హామీలనుఅమలు చేయడానికి మనం అవకాశాన్ని ఇవ్వాలి' అని రతన్ చెప్పుకొచ్చారు.
శుక్రవారమిక్కడ జరిగిన 'ముంబై ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బొకాని' స్నాతకోత్సవంలో కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవస్థపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. మోడీ అంచనా వేసినట్లుగానే దేశం ముందుకు వెళుతుందని మేం అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. విద్యార్ధులు విలువలను నిలబెట్టుకోవాల్సిందిగా ఆయన హితవు పలికారు.