సీహెచ్ విద్యాసాగర్ రావ్ కే టీఎన్ పూర్తి బాధ్యత ?
చెన్నై: తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావుకు ఇక పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా అనే ప్రశ్న మొదలైయ్యింది. తమిళనాడులో మీడియా మాత్రం ఇక మన రాష్ట్రానికి విద్యాసాగర్ రావు పూర్తి స్థాయి గవర్నర్ గా పని చేస్తారని ప్రచారం మొదలు పెట్టింది.
ఈ విషయంపై ఢిల్లీలో కసరత్తులు మొదలైనాయని సంకేతాలు వస్తున్న నేపధ్యంలో ఇక హీజ్ ఎక్స్ లెన్సీ అనే పదాన్నివాడొద్దు, గౌరవనీయులైన గవర్నర్ గారు అని సంబోధిస్తే చాలు అంటూ సీహెచ్. విద్యాసాగర్ రావు ఆదేశాలతో రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా కొణిజేటి రోశయ్య పదవీకాలం పూర్తి అయిన తరువాత ఇన్ చార్జ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ రావు ప్రస్తుతం చెన్నైలోనే ఉంటున్నారు. జయలలిత ఆరోగ్యం కుదటపడాలని ఆయన చెప్పారు. అపోలో ఆసుపత్రికి రెండు సార్లు వెళ్లి జయలలిత ఆరోగ్యంపై వివరాలు సేకరించారు.
సీహెచ్. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్ గా పూర్తి బాధ్యతల్నిచూసుకుంటున్నారు. అయితే తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు గమనించిన కేంద్ర ప్రభుత్వం అక్కడ పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించాలని నిర్ణయించింది. గుజరాత్ సీఎం ఆనంది బెన్ తో సహ పలువురు నేతల పేర్లు తెరమీదకు వచ్చాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఓ నిర్ణయం తీసుకోలేదు. ఇతరులకు పూర్తి బాధ్యతలు అప్పగించడం కన్నా ఇన్ చార్జ్ గా ఉన్న సీహెచ్. విద్యాసాగర్ రావుకు పూర్తి భాధ్యతలు అప్పగించడం మేలు అని కేంద్రం నిర్ణయం తీసుకుందని సమాచారం. విద్యాసాగర్ రావుకు పూర్తి స్థాయి బాధ్యత అప్పగించడానికి ఢిల్లీలో కసరత్తులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.