చనిపోయిన భర్తపై ‘గృహహింస’ కేసు పెట్టింది
గుర్గావ్: మహిళలకు రక్షణగా ఉంటుందని ప్రభుత్వం తీసుకువచ్చిన వరకట్న వేధింపుల చట్టం ఐపీసీ సెక్షన్ 498ఏ కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
భర్త ఆత్మహత్య కేసులో ఇరుక్కోకుండా ఉండేందుకు ఓ భార్య తప్పుడు కేసు పెట్టింది. భర్త మరణించిన మరుసటి రోజే తన అత్తమామలు, భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో భర్త మరణంపై ఆమెను ప్రశ్నించాల్సిన పోలీసులు, చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులపై విచారణ మొదలుపెట్టారు.
ఈ ఘటన హర్యానాలోని గుర్గావ్ ప్రాంతంలో జరిగింది. ఓ బ్యాంకులో పనిచేస్తున్న రాకేష్ పిలానియా, అక్టోబర్ 5న తన అపార్టుమెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరుసటి రోజే ఆయనతో సహా, అత్తమామలపై రాకేష్ భార్య కేసు పెట్టింది.
రాకేష్ మరణించినందున ఆయన పేరు తొలగిస్తామని, అత్తమామలపై విచారణ జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. తన కోడలి వేధింపుల మూలంగానే కొడుకు ప్రాణాలు తీసుకున్నాడని రాకేష్ తండ్రి ప్రకాష్ వాపోతున్నారు.