సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నసీం జైదీ
న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా డాక్టర్ నసీం జైదీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆ పదవిలో కొనసాగిన హెచ్ ఎస్ బ్రహ్మా పదవికాలం శనివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ నసీం జైదీని నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటి వరకు ఆయన ఎన్నిక కమిషనర్గా విధులు నిర్వహించారు. జైదీ పూర్తి పేరు డాక్టర్ సయ్యద్ అహ్మద్ నసీం జైదీ. 1976 బ్యాచ్కు చెందిన నసీం జైదీ ఉత్తర ప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో పౌర విమానయాన శాఖలో చాలా కాలం పనిచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నసీం జైదీ సీఈసీగా జులై 2017 వరకు విధులను నిర్వర్తించనున్నారు.
డాక్టర్ నసీం జైదీ భారత దేశానికి 20వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ). ప్రస్తుతం ఆయన వయసు 65 సంవత్సరాలు. డాక్టర్ నసీం జైదీ ప్రభుత్వ కెన్నెడీ స్కూల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉన్నారు. బయో కెమిస్ట్రీలో ఆయన పీహెచ్డీని పూర్తి చేశారు.
నవంబర్ 2005 నుంచి 2008 వరకు icaoలో భారత్ తరుపున శాశ్వత సభ్యునిగా పనిచేశారు. పౌర విమానయాన శాఖలో డైరెక్టర్ జనరల్గా చాలా కాలం పనిచేశారు. జులై 31, 2012న సివిల్ ఏవియేషన్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు.