డ్రగ్స్ కేసు: సెల్ టవర్ లొకేషన్, హెల్త్ రిపోర్టులే కీలకం.. బయటపడేందుకు కొత్త ఎత్తులు..
డ్రగ్స్ వ్యవహారంలో రెండో విడతలో భాగంగా ఏడుగురికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే నోటీసులు, విచారణను తప్పించుకునేందుకు టాలీవుడ్ తారలు కూడా సరికొత్త ఎత్తులు వేస్తున్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ను వణికిస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో రెండో విడతలో భాగంగా ఏడుగురికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అదే సమయంలో నోటీసులు మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. విచారణను తప్పించుకునేందుకు టాలీవుడ్ తారలు కొత్త ఎత్తులు వేస్తుండడమే ఇందుకు కారణం.
ఎక్పైజ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ నోటీసుల ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు అధికారులకు కొత్త కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపింది. 19 నుంచి విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలను టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. నోటీసులు అందుకున్న వారంతా సినీ పెద్దలను ఆశ్రయిస్తున్నారు. సిట్ నోటీసులకు బ్రేక్ పెట్టేందుకు మంతనాలు జరుపుతున్నారు. తమ సెల్ఫోన్లు ఎప్పుడూ తమ వ్యక్తిగత సహాయ సిబ్బంది వద్దే ఉంటాయనే కొత్త వాదన వినిపిస్తున్నారు. తమవద్ద పనిచేసే వారే దుర్వినియోగం చేసి ఉండొచ్చంటూ వివరణ ఇస్తున్నారు.
చట్టాన్ని తాము గౌరవిస్తాం కానీ.. అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. దీంతో సిట్ మరింత పట్టుదలగా ముందుకెళ్తోంది. సెల్ టవర్ లొకేషన్, హెల్త్ కండిషన్ రిపోర్టులు తెప్పించుకుంటోంది. పూర్తిగా ఆధారాలు సేకరించాకే పేర్ల వెల్లడికి సిద్ధమవుతోంది.