ప్రేమజంట అతి: ముద్దులు, కౌగిలింతలు, పోలీసులపై దాడి
చెన్నై: మద్యం మత్తులో బైక్ నడిపి నానా రభస సృష్టించడమే గాక.. ఓ పోలీసు అధికారిపై చేయి చేసుకుందో యువతి. అంతటితో ఆగకుండా తన ప్రియుడితో ముద్దాడుతూ, కౌగిలించుకుంటూ వెకిలిచేష్టలు చేసింది. ఈ ఘటన తమిళనాడులోని వేలూరులో కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. వేలూరు అన్నాసాలైలో సోమవారం మధ్యాహ్నం ఒక ప్రేమ జంట మద్యం మత్తులో బైక్ వేగంగా నడుపుతూ ఇతర వాహనదారులను హడలెత్తించారు. ఇతర వాహనాలను ఢీకొంటూ అడ్డదిడ్డంగా ద్విచక్ర వాహనాన్ని నడిపారు. మక్కాన్ సిగ్నల్ వద్దకు వచ్చేసరికి సిగ్నల్ పడటంతో అక్కడ ఆగారు.
ఆ సమయంలో పక్కనున్న మరో వాహన చోదకుడు ఎందుకు ఇలా దురుసుగా వాహనం నడుపుతున్నారని ప్రశ్నించడంతో వెనుక కూర్చున్న యువతి బండి నుంచి దిగి ఆ వ్యక్తి చొక్కాపట్టుకుని కొట్టింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ రాజ్కుమార్ అక్కడికి వచ్చి అడ్డుకోగా మద్యం మత్తులో ఉన్న ఆ యువతి ఆయన చొక్కా పట్టుకుని చింపేసి దాడి చేసింది.
దీంతో ఆయన సమీపంలో ఉన్న నార్త్ పోలీసు స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అక్కడి నుంచి ఎస్ఐ నిర్మల వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగా ఆ యువతి ఆమెపైనా దాడిచేసినట్లు పోలీసులు చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బంది వచ్చి ఈ జంటను బలవంతంగా అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా మద్యం మత్తులో ఉన్న యువతి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది.
ఇదే సమయంలో ఒక్కసారిగా ఆ యువతి, యువకుడు ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకున్నారు. వెంటనే పోలీసులు వారిని వేరుచేసి అతని వద్ద ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించారు. అతను తుత్తిపట్టు కామరాజనగర్కు చెందిన వివేకానంద్ అని, ఆ యువతి బెంగుళూరుకు చెందిన అర్చనగా గుర్తించారు.
వివేకానంద్పై మద్యం మత్తులో వాహనం నడిపిన కేసు నమోదు చేసి జరిమానా విధించి పంపించేశారు. పోలీసులపై దాడి చేసిన ఆ యువతిపై కేసు నమోదు చేసి రాత్రి ఎనిమిది గంటల సమయంలో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి వేలూరు మహిళా కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.