ప్రేయసిని చంపేసి శవాన్ని ఇంట్లో దాచాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నవీన్ అనే యువకుడు తన ప్రేయసిని అర్జూను దారుణంగా చంపేసి ఆమె మృతదేహాన్ని తన ఇంట్లోనే దాచాడు. ఆ తర్వాత 48 గంటల్లోనే ఏమీ తెలియనట్లు నటిస్తూ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అర్జూ ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థిని. తనను ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి అర్జూ అడ్డుకుంది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు ఏకంగా ఆమెను చంపేసి బీరువాలో దాచేశాడు. తమ కుమార్తె కనిపించకపోవడంతో అర్జూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్పై అనుమానాలు వ్యక్తం చేశారు.
పోలీసులు విచారణ చేసి నవీన్ ఇంట్లోని బీరువానుంచి అర్జూ మృతదేహాన్ని బయటకు తీశారు. ఐదు రోజుల పాటు శవం ఇంట్లోనే ఉంది. నవీన్ ఖత్రీ (23)ని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్జూ చౌహాన్ను నవీన్ ఖత్రీ గొంతు నులిమి హత్య చేసి శవాన్ని దాచి పెట్టి గురువారంనాడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు,
ఖత్రీని అరెస్టు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డిసిపి విజయ్ సింగ్ చెప్పారు. ఆర్జూ ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని లక్ష్మీబాయ్ కాలేజీలో ఫైనల్ చదువుతోంది. ఖత్రీ ఆదాయం ఇంటి అద్దె మాత్రమే. ఈ ఘటనలో ఖత్రీ కటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.