నరేంద్ర మోడీ సార్ మిలటరీ బలగాలు పంపించండి: తమిళనాడు
జల్లికట్టు ఆందోళనలతో తమిళనాడు అట్టుడకడంతో కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని ఆ రాష్ట్ర హోం శాఖ అధికారులు నిర్ణయించారు. సోమవారం కేంద్ర బలగాలను పంపించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మనవి .
చెన్నై: తమిళనాడులో శాంతిభద్రతలు అదుపు చెయ్యడానికి స్థానిక పోలీసులు నానాతంటాలు పడుతున్నారు. జల్లికట్టు ఆందోళనలు అదుపు చెయ్యడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది.
మెరీనా బీచ్ ఖాళీ చేయిస్తున్న పోలీసులు, విద్యార్థుల ఎదురుదాడి
వెంటనే తమిళనాడుకు కేంద్ర బలగాలు పంపించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం సాయంత్రం మనవిచేశారు. జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని చెన్నై నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే సోమవారం ఒక్క సారిగా ఆందోళలు హింసాత్మకంగా మారిపోవడంతో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎక్కువ అయ్యాయి. ఆందోళనకారుల ముసుగులో కొందరు అల్లరిమూకలు పలు ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలకు నిప్పంటించారు.
జల్లికట్టు, ఇద్దరి మృతి, లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం
పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయు గోళాలు ప్రయోగించి ఆందోళనకారులను చెల్లాచెదురు చేస్తున్నారు. ఆందోళనలు మరింత వ్యాపించకుండా చూడటానికి పలు చర్యలు తీసుకుంటున్నారు.
అయితే కేంద్ర బలగాలను రంగంలోకి దింపితే తప్పా పరిస్థితి అదుపులోకి రాదని గుర్తించిన హోం శాఖ అధికారులు అదనపు బలగాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. తమిళనాడుకు అదనపు బలగాలను పంపించడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకారం తెలిపిందని ఆ రాష్ట్ర పోలీసు అధికారులు తెలిపారు.