అమిత్ షా దూకుడుకు అడ్డుకట్ట?: కాంగ్రెసు కన్నా రెండాకులు ఎక్కువే
గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుసరించిన వ్యూహంతో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కంటే భిన్నమేం కాదని, రెండాకులు ఎక్కువే చదివానని రుజువు చేసుకున్నది.
న్యూఢిల్లీ: 1980వ దశకంలో జనతా పార్టీని చీల్చి ఏర్పాటైన బీజేపీ భిన్నమైన పార్టీ అని ప్రచారం సంపాదించుకున్నది. కానీ గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుసరించిన వ్యూహంతో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కంటే భిన్నమేం కాదని, రెండాకులు ఎక్కువే చదివానని రుజువు చేసుకున్నది.
కాకపోతే గుజరాత్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలు అడ్డు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగలిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహానికి ఎదురు దెబ్బ తగిలినా ఆయన ఆగుతారా? అంటే సందేహస్పదమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
మోదీ సర్కార్ ఇలా దూకుడు
1998లో వాజ్ పేయి హయాంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా ఆ సంప్రదాయం కాపాడుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ 2009 ఎన్నికల్లోనూ విపక్షంలోనే కూర్చుకున్న కమలనాథుల్లో ప్రత్యేకించి దాని మార్గదర్శక సంస్థ ఆరెస్సెస్ ప్రత్యామ్నాయంగా 2013లో గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీని ముందుకు తీసుకొచ్చింది. అచ్చేదిన్, అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత, ఉద్యోగాల హామీ వంటి భారీ హామీలతో 2014లో చారిత్రక విజయాలతో మోదీ ప్రభుత్వం కొలువుదీరింది. నాటి నుంచి దూకుడుగానే ముందుకు సాగుతోంది కేంద్రంలో ఎన్డీయే సర్కార్కు నాయకత్వం వహిస్తున్న బీజేపీ.
Recommended Video
విపక్ష పార్టీల రాష్ట్రాల్లో కేంద్రం ఇలా జోక్యం
‘బీహార్, ఢిల్లీ' మినహా ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలోనూ విజయం సాధిస్తూ ముందుకు సాగుతూ వచ్చింది. దీంతో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీ ద్వయం దూకుడుకు అడ్డుకట్ట వేసే వారే లేకపోయారు. విపక్షాలు చేష్టలుడిగి ఉండటం కూడా దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించాక.. విపక్షాల ప్రత్యేకించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మోదీ సర్కార్ వేలు పెట్టింది. ముందుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చేసి.. తనకు అనుకూలంగా మార్చేసుకుని, సొంత పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వేలు పెడితే.. న్యాయవ్యవస్థ ఇంకా జవజీవాలతో సమర్థంగా పని చేస్తున్నామన్న సంకేతాలిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో వెనుకడుగు వేసినా రూట్ మాత్రం మార్చలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేల్లో కీలకమైన వారిని వారంతట వారు బీజేపీలో చేరేలా వ్యూహ రచన చేసి.. తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ.
బీజేపీకి ఇలా తలబొప్పి
ఈ పనులన్నీ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బాగానే చేసింది. ఇలాంటి అప్రజాస్వామిక పనులు చేయడం కాంగ్రెస్కు కొత్త కాదు. కాకపోతే ప్రతిపక్షాలు, మీడియా ఆనాడు గట్టిగా వ్యతిరేకించాయి. కాంగ్రెస్కు భిన్నమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఇవాళ తాను రెండాకులు ఎక్కువే చదివినట్టు రుజువు చేసుకున్నది. రెండు, మూడు సార్లు తల బొప్పి కట్టినా బీజేపీ ఆగడం లేదు. గుజరాత్లో కూడా వేలు పెట్టింది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పని చేసింది కాబట్టి సరిపోయింది. బీజేపీకి అది చెంపపెట్టు అయింది. ఇంత జరిగినా బీజేపీ ఆగుతుందన్న నమ్మకం లేదు. రేపు మరో రాష్ట్రంలో వేలు పెట్టదన్న గ్యారెంటీ కూడా లేదు.
బీహార్లో మహా కూటమికి ఇలా బీటలు
ఇటీవలి కాలంలో రాష్ట్రాల్లో బీజేపీ జోక్యం పెరుగుతూ వచ్చింది. ప్రతిపక్షంపై పనిగట్టుకుని దాడులు చేయడం గతంలో ఏనాడూ ఇంతగా సాగలేదు. దేశ రాజకీయాల్లో ఇది బీజేపీ ప్రవేశ పెట్టిన కొత్త ఒరవడి అని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు. బీహార్ అందుకు మరో పెద్ద ఉదాహరణ. బీహార్లో తనకు వ్యతిరేకంగా నిలిచిన లాలూ - నితీశ్ - కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహా కూటమి ప్రభుత్వాన్ని కూల్చేసిన ఘనత మోదీ సర్కార్ సొంతం చేసుకున్నది. 2013లో తనను వ్యతిరేకించిన నితీశ్ కుమార్ తో రాజీ పడాలని ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తమ దీర్ఘ కాలిక వ్యూహంలో భాగంగా నిర్ణయించారు. అందుకే లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్పై అవినీతి కేసు అస్త్రాన్ని ప్రయోగించారు. అసలే లాలూ ప్రసాద్ యాదవ్ మొండివాడన్న ప్రతీతి. పుత్ర వాత్సల్యం ఎక్కువే మరి. తన కొడుకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని లాలూ మొండి పట్టుదల ప్రదర్శించారు మరి. దాని సాకుగా నితీశ్ తన మహా కూటమి ప్రయోగానికి తానే తిలోదకాలిచ్చేశారు.
లాలూ కట్టడికి ఇలా మోదీ వ్యూహం
ఇక్కడ ఒక కారణం ఉంది సుమా. దేశ రాజకీయాల్లో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న నేతల్లో లాలూ ఒకరు. ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను అవినీతి కేసుల్లో ఇరుక్కుని చేసేలా చక్రబంధంలోకి నెట్టివేసిన ఘనత మోదీ - అమిత్ షాల వ్యూహ ఫలితం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రస్తుతం రాజ్యసభలోనూ అతిపెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ సాధించలేదు. బీజేపీ ఎందుకలా చేస్తోంది అంటే అందుకు ఒక్కటే జవాబు. బీజేపీ నిర్ణయాల మంచి చెడ్డలపై ఆ పార్టీలో అసలు చర్చ అనేదే లేకుండా పోయింది. కేవలం ఇద్దరు నాయకులే పార్టీని నడిపిస్తున్నారని, అందుకే నైతికత, అనైతికత అనే అంశాలను చర్చించే వారే కరువయ్యారు. సుమారు 15 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా, మరికొన్ని రాష్ట్రాల్లో దాని మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఉత్తరాది పార్టీ అన్న ముద్ర బీజేపీపై ఉన్నది. కానీ తాజాగా దక్షిణాది రాష్ట్రాల్లో తిష్ఠ వేయాలని ముందు నుంచి ప్రణాళికలు సిద్దం చేస్తున్నది.
అన్నాడీఎంకేలో కలిస్తేనే ఎన్డీయేలో భాగస్వామ్య హామీ
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అక్కడ పాగా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటివరకు ద్రవిడ రాజకీయాలు సాగుతూ వచ్చిన తమిళనాట పాగా వేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. కానీ జయలలిత మరణంతో అన్నాడీఎంకే పార్టీకి పరిస్థితులు విషమంగా మారాయి. పార్టీ రెండు గ్రూపులుగా చీలింది. కానీ ఆ రెండు గ్రూపులు విలీనమైతేనే ఎన్డీయే పక్షంలో చేర్చుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ పార్టీ గ్రూపులకు తేల్చేశారు. ఏదో రకంగా దేశంలోని అన్ని పార్టీలు తన ఛట్రంలోకి వచ్చి చేరాలని మోదీ - షా ద్వయం వ్యూహంగా కనిపిస్తున్నది. తాజాగా గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను ఓడించేందుకు జరిగిన సన్నాహాలు ఎన్నికల సంఘం నిబంధనలతో తప్పిపోయినా ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తలబొప్పి కట్టినా వెనక్కు తగ్గుతారన్న సంకేతాలు కనిపించడం లేదు. ఒక చేత్తో కాకుంటో మరో చేత్తో అన్నట్లు కమలనాథులు రాజకీయాలు చేస్తున్నారు.
చేష్టలుడిగిన విపక్షాలు
అందుకు చట్టాన్ని తమకు అనువుగా మార్చుకుంటున్నది బీజేపీ. తమకు వ్యతిరేకంగా ఉన్న బీహార్ నేత లాలూప్రసాద్ యాదవ్ పని బట్టేందుకు చట్టం తనపని తాను చేస్తుందన్న నానుడిని ముందుకు తెస్తున్నారు బీజేపీ నేతలు. అహ్మద్ పటేల్ కు మద్దతుగా 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రిసార్టు వేదికగా కల్పించినందుకు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ పైనా ఐటీ చట్టం ప్రయోగించిన ఘనత మోదీ సర్కార్ది. కానీ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఛత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాల వైపు ఆ చట్టం చూడనే చూడదని.. అటువంటి తాజా నిబంధనలు బీజేపీ అందుబాటులోకి తీసుకొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ ఇంత దూకుడుగా ముందుకు సాగడానికి కారణం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేష్టలుడిగి పోయింది. విపక్షాలు ఆత్మరక్షణలో పడిపోయాయి. తద్వారా భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించిందన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.