దయానిధి మారన్కు షాక్: 742 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
చెన్నై: డీఎంకే లీడర్, కేంద్ర మాజీ టెలికం శాఖ మంత్రి దయానిధి మారన్కు చెందిన రూ. 742 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఎయిర్సెల్-మ్యాక్సిస్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్ అభియోగాలను దయానిధి మారన్ ఎదుర్కొంటున్నారు. ఈ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈడీ బుధవారం తాత్కాలికంగా జప్తు చేసిన ఆస్తుల్లో మారన్, ఆయన కుటుంబ సభ్యులు, సహచరుల ఆస్తులు కూడా ఉన్నాయి. డిసెంబర్ 2014 మొదటి వారంలో ఈడీ ఢిల్లీ ఆఫీసులో రెండు నుంచి మూడు రోజుల పాటు దయానిధి మారన్ను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.
మనీలాండరింగ్ కేసులో సీబీఐ పలు చార్జిషీట్లను కూడా దాఖలు చేసింది. 2004-07 కాలంలో కేంద్ర టెలికం శాఖ మంత్రిగా దయానిధి మారన్ పని చేశారు. ఆ సమయంలో చెన్నైలోని ఎయిర్ సెల్ కంపెనీ ప్రమోటరైన శివశంకరన్ 2జి స్పెక్ట్రం లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
రెండు సంవత్సరాల పాటు ఆయన కంపెనీకి లైసెన్సు ఇవ్వకుండా ఎయిర్ సెల్ కంపెనీని మలేసియాకి చెందిన మాక్సిస్ కంపెనీకి అమ్మేయాలని ఆయనపైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. దీంతో చేసేదేమిలేక డిసెంబర్ 2006లో ఎయిర్ సెల్ కంపెనీలోని మెజారిటీ షేర్లను మాక్సిస్ కంపెనీకి అమ్మేశాడు.
ఆ తర్వాత ఆరు నెలల్లోనే ఎయిర్ సెల్కి 14 లైసెన్సులూ వచ్చేలా చేశాడు. ఎయిర్ సెల్ కంపెనీని తనకు అమ్మేలా చేసినందుకు మాక్సిస్ కంపెనీ దయానిధి మారన్ బ్రదర్ కంపెనీ సన్ డైరెక్ట్ కంపెనీలో రూ.599.01 కోట్లు పెట్టుబడి పెట్టాడని సీబీఐ తన నివేదికలో పేర్కొంది.