స్మృతి ఇరానీ: పిల్లల కోసం అందరిలాగే ఇంటర్వ్యూ
న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి అందరిలాగే పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి స్వయంగా వెళ్లారు. పైగా, అందరి తల్లిదండ్రుల మాదిరిగానే ఆమె కూడా ఇంటర్వ్యూను ఎదుర్కున్నారు. ఢిల్లీలోని ఓ పాఠశాలలో తన పిల్లలను చేర్పించడానికి అందరి తల్లిదండ్రుల మాదిరిగానే స్మృతి ఇరానీ స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి చేపట్టిన స్మృతి ఇరానీ ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు.
పీటీఐ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖిలో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ప్రస్తుతమున్న స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోలేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీవీ యాంకర్గా పనిచేశానని, తర్వాత రాజకీయాల్లో చేరి 38 ఏళ్లకే కేంద్ర మంత్రిగా ఎదిగానని వివరించారు.
కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన తన కోసం నిబంధనలు మార్చబోరని, ఇది కూడా ఓ ఉద్యోగం, బాధ్యత లాంటిదేనని అభిప్రాయపడ్డారు. అందరు తల్లిదండ్రుల మాదిరిగానే తన పిల్లలను పాఠశాలలో చేర్పించడానికి భర్తతో కలిసి తాను కూడా ఇంటర్వ్యూకు వెళ్లానన్నారు. పాఠశాలలో నిర్వహించే పేరెంట్స్-టీచర్స్ సమావేశాలకు కూడా తరచుగా హాజరవుతుంటానని చెప్పారు.
ఆ సమయంలో భద్రతా సిబ్బందిని కూడా దూరంగా ఉంచుతానన్నారు. తాను ప్రవేశించిన ప్రతీ రంగం కూడా తనకు మంచి గుర్తింపును ఇచ్చిందని స్మృతి చెప్పారు. కష్టపడేవారు చాలా మంది ఉన్నప్పటికీ వారికి తగిన అవకాశాలు కూడా రావాల్సి ఉంటుందని, తనకు అలాంటి అవకాశాలు వచ్చాయని ఆనందం వ్యక్తం చేశారు.
ముంబై నుంచి ఢిల్లీకి మారిన కొత్తలో ఓ నెల పాటు ఇంటికీ, పనికి మధ్య సమతుల్యత సాధించడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒకరికి 11 ఏళ్ల వయస్సు కాగా, మరొకరికి 13 ఏళ్ల వయస్సు అని చెప్పారు.