అనగనగా ఆరో తరగతి లవ్ స్టోరీ : ఎంత పనిచేశారంటే..?
హైదరాబాద్ : చిన్నపిల్లలకు ఇష్టమైన 'అనగనగా కథల్లాగా..' దీన్ని ఓ కథలాగా మలిచేయోచ్చేమో..! సినిమాల ప్రభావమో.. లేక చుట్టూ ఉన్న ఫాస్ట్ కల్చర్ ప్రభావమో..! గానీ మొత్తానికి ఆరో తరగతి చదివే ఇద్దరు చిన్నారులు ప్రేమికుల అవతారమెత్తారు. అయితే అక్కడితే ఆగిపోతే ఈ వ్యవహారం వార్తల్లోకి ఎందుకు ఎక్కుతుంది?
ఫక్తు సినిమా ప్రేమికుల్లాగే ఇద్దరూ ఇంట్లోంచి పారిపోయారు. బహుశా ఎన్ని కష్టాలెదురైనా కలిసే ఉండాలని ఓ సినిమా డైలాగ్ కూడా చెప్పేసుకునే ఉంటారు. అందుకే స్కూల్ కి అని వెళ్లిన ఆ ఇద్దరు చిన్నారులు అటు నుంచి అటే పారిపోయారు. బయటయితే అడుగుపెట్టారు గానీ చిన్న పిల్లలు కావడంతో ఎవరూ ఆశ్రయం ఇవ్వలేదు. అద్దె ఇళ్లు కోసం కూడా వెతికారట.. బహుశా వాళ్ల అమాయకత్వానికి అక్కడివాళ్లు నవ్వుకుని ఉండవచ్చు.
ఆఖరికి ఇంట్లో వాళ్లు ఫోన్ చేస్తే దొరికిపోతామేమోనని సదరు ఆరో తరగతి ప్రేమికుడు తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ ను కూడా స్విచ్చాఫ్ చేశాడు. అప్పటికే కంగారు పడ్డ తల్లిదండ్రులు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. అయితే స్కూల్ బ్యాగ్స్, స్కూల్ యూనిఫామ్స్ లో ఉన్న వాళ్లిద్దరికీ ఎవరూ ఇళ్లు అద్దెకు ఇవ్వకపోవడంతో.. చివరగా తన మిత్రుడికి ఫోన్ చేసేందుకు మొబైల్ స్విచ్చాన్ ఆన్ చేశాడు. ఇంకేముంది సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసిన పోలీసులు ఆచూకీ కనిపెట్టారు.
గుజరాత్ లోని అహ్మబాద్ పరిధిలో ఉన్న నడియాడ్ లో ఈ ఘటన జరగ్గా.. మొత్తానికి పిల్లల ఆచూకీ కనిపెట్టి వారిద్దరిని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. అయితే ఎందుకు పారిపోయారని వారిద్దరిని ప్రశ్నించగా.. చోటీ లవ్ స్టోరీ మొత్తం వినిపించారు.. అదంతా విన్న ఆ చిన్నారుల తల్లిదండ్రులు బాగానే నవ్వుకున్నారట. దేశవ్యాప్తంగా ఇప్పుడీ చోటీ సీ లవ్ స్టోరీ వైరల్ గా మారిపోయింది.