దేశంలో గ్రామీణ విద్యుదీకరణ జరుగుతోందా?
దేశంలో నేటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోని 18,452 గ్రామాలకు తమ ప్రభుత్వ హయాంలో ఆ సౌకర్యం కల్పిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హామీ ఇచ్చారు.
న్యూఢిల్లీ: 2015 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. దేశంలో నేటికీ విద్యుత్ సౌకర్యానికి నోచుకోని 18,452 గ్రామాలకు తమ ప్రభుత్వ హయాంలో ఆ సౌకర్యం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు.
కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కూడా దేశ వ్యాప్తంగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే ఈ హామీల అమలుకు కేవలం విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసినంత మాత్రాన సరిపోదు. తయారైన విద్యుత్ ను గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంటుంది.
క్షేత్ర స్థాయిలో సన్నాహాలు...
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట నుంచి ఈ హామీ ఇవ్వడానికి కొద్దిరోజుల ముందే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన(డీడీయూజీజేవై) కి శ్రీకారం చుట్టారు. ఇది గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో అమలులో ఉన్న రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో ఈ కొత్త పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఫీడర్ లైన్లను వేరు చేస్తారు. 2006లోనే గుజరాత్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరిగింది. అక్కడి పల్లె పల్లెకు విద్యుత్ సరఫరా జరిగింది.
సమాచార నిక్షిప్తానికి ‘గర్వ్'...
డీడీయూజీజేవై పథకంలో భాగంగా జరిగే పనులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ‘గర్వ్' పేరిట కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ను రూపొందించింది. గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించి ఆయా రాష్ట్రాలు అందించే వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇందులో పొందుపరుస్తున్నారు. ప్రతి పౌరుడు.. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సహాయంతో గ్రామీణ విద్యుదీకరణ ప్రగతి గురించి తెలుసుకోవచ్చు. ఆయా గ్రామాలలో విద్యుదీకరణ జరిగిన తేదీలు, స్థానికంగా ఉండే లైన్ మెన్లు, ఎక్కడెక్కడ విద్యుత్ స్తంభాలున్నాయో తెలిపే చిత్రాలతో సహా అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్ లో ఉండే వివరాలను ఇప్పటికే ఎంతోమంది పాత్రికేయులు, పరిశోధకులు సరిపోల్చుకున్నారు. తాజాగా గర్వ్ పోర్టల్ ను మరింత ఆధునీకరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల విద్యుదీకరణకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వస్తున్నారు.
1000 రోజుల్లో సాధించిన ప్రగతి...
దేశంలో విద్యుదీకరణకు నోచుకోని 18,452 గ్రామాలకు విద్యుదీకరణ సదుపాయం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ విధించిన 1000 రోజుల గడువు వచ్చే ఏడాది మే నెల (2018 మే)నాటికి పూర్తికానుంది. ఇప్పటివరకు 13,598 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడం ద్వారా లక్ష్యంలో 74 శాతాన్ని పూర్తి చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో అమలైన రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకం సగటు వార్షిక పెరుగుదలతో పోల్చుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ అమలుచేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన(డీడీయూజీజేవై) సగటు వార్షిక పెరుగుదల తక్కువే. 2005 నుంచి 2012 మధ్య దేశ వ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందాయి. అయితే గడిచిన రెండేళ్లలో మాత్రం ఈ సగటు వార్షిక పెరుగుదల బాగా పుంజుకుంది. నేటికీ 18,000 గ్రామాలకు విద్యుత్ వెలుగులు ప్రసరించకపోవడానికి కారణం అవి తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో ఉండడమే. ఇక దేశంలోని ఆయా గ్రామాలను పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేయడంతో ఈ పథకంలో ప్రభుత్వం పాత్ర పూర్తి కాదు. గ్రామీణ భారతంలోని అన్ని నివాస ప్రాంతాలు, ఇళ్లు విద్యుదీకరణకు నోచుకోవాల్సిందే. మొత్తం 17.9 కోట్ల ఇళ్లలో ఇప్పటి వరకు (74 శాతం) 13.4 కోట్ల ఇళ్లకు మాత్రమే విద్యుత్ సౌకర్యం కల్పించబడింది. దేశంలోని 6.04 లక్షల గ్రామాలుండగా, వాటిలో కేవలం (27 శాతం) 1.65 లక్షల గ్రామాలకు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగింది.
మున్ముందు ప్రణాళిక...
వారంలో ఏడు రోజులూ, 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలంటే క్రమంగా విద్యుదుత్పత్తి కూడా పెరగవలసిన అవసరం ఉంది. మరోవైపు విద్యుత్ సరఫరా పెరిగే కొద్దీ వినియోగం కూడా పెరుగుతుంది. ఫలితంగా వినియోగానికి అనుగుణంగా ఉత్పత్తి కూడా పెంచవలసి ఉంటుంది. ఈ విద్యుదీకరణ ప్రాజెక్టు ఒక దశకు చేరుకున్నాక కేంద్రం క్రమంగా తన క్రియాశీలక పాత్రను తగ్గించుకుంటుంది. ఎందుకంటే, అప్పుడు విద్యుత్ సరఫరా బాధ్యతను ఆయా రాష్ట్రాలు సమర్ధంగా తీసుకోగలుగుతాయి కాబట్టి.
ఇలా.. ఈ పథకం విజయంలో కేంద్ర, రాష్ట్రాల బాధ్యత ఇమిడి ఉంటుంది. మరోవైపు ఆయా డిస్కంల అప్పుల భారాన్ని తగ్గించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉదయ్' పథకం కూడా సత్ఫలితాలనిస్తోంది.