ది గ్రేట్ రైటర్ మహాశ్వేతా దేవి కన్నుమూత..
కోల్ కతా : ఎన్నో అవార్డులతో కీర్తి శిఖరాలను అందుకున్న ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి మహాశ్వేతా దేవి కన్నుమూశారు. 90 ఏళ్ల వయసున్న ఆమె తీవ్రమైన గుండెపోటుతో గురువారం నాడు తుది శ్వాస విడిచారు. 1926 జనవరి 14వ తేదీన బంగ్లాదేశ్ లోని ఢాకాలో జన్మించిన మహాశ్వేతాదేవి కోల్ కతాలో రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లో విద్యాభ్యాసం చేశారు.
గత రెండు నెలలుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతోన్న మహాశ్వేతాదేవికి కోల్ కతాలోని బెల్లె వ్యూ క్లినిక్ లో లైఫ్ సపోర్ట్ మెషీన్స్ ద్వారా చికిత్స అందిస్తూ వస్తున్నారు అక్కడి వైద్యులు. రక్తంలో ఇన్ ఫెక్షన్ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులు ఆమెను బాధించడంతో పాటు గుండెపోటు రావడంతో ఆమె ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందారు.
విశ్వభారతి యూనివర్సిటీ నుంచి బీఏ పట్టభద్రురాలైన మహాశ్వేతా దేవి.. కోల్ కతా యూనివర్సిటీలో ఆంగ్లంలో ఎంఏ చదివారు. శ్వేతాదేవి తండ్రి మనీశ్ ఘటక్ కూడా రచయితే. విద్యాభ్యాసం తర్వాత మహాశ్వేతాదేవి ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజోన్ భట్టాచార్యను వివాహమాడారు.
1964లో కోల్ కతా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న బిజోయ్ గఢ్ కాలేజిలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆ తర్వాత పలు సామాజిక అంశాలపై కూడా ఉద్యమించిన ఆమె.. గిరిజనులు, మహిళలు, దళితులకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాల్లో గిరిజన చైతన్యం కోసం ఆమె ఉద్యమించారు.
మహాశ్వేతాదేవి రచనల్లో 'హజర్ చౌరాషిర్ మా', ' బ్రెస్ట్ స్టోరీస్', 'టిన్ కొరిర్ సాధ్' డస్ట్ ఆన్ ద రోడ్, అవర్ నాన్ వెజ్ కౌ, ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ, ఓల్డ్ వుమెన్, డకతేయ్ కహానీ, టిల్ డెత్ డు అజ్ పార్ట్ వంటి తదితర రచనలు పాఠకుల మన్ననలు పొందాయి. ఇక అవార్డుల విషయానికొస్తే.. ప్రఖ్యాత అవార్డులెన్నో ఆమె ప్రతిభకు తలవంచాయి.
మహాశ్వేతాదేవి అవార్డుల జాబితా :
1979లో బెంగాలీ రచన అరణ్యర్ అధికార్ కు గాను ఆమెకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది
1986లో పద్మశ్రీ అవార్డు
1999లో జ్ఞానపీఠ్ అవార్డు
1997లో రామన్ మెగసెసె అవార్డు
2006లో పద్మ విభూషణ్ అవార్డుతో పాటు మరికొన్ని అవార్డులు ఆమెను వరించాయి.
మమతా బెనర్జీ ప్రగాఢ సానుభూతి :
రచయిత్రి మహాశ్వేతాదేవి మరణం పట్ల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మహాశ్వేతాదేవి మృతిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన మమతా బెనర్జీ ఇండియా ఓ గొప్ప రచయిత్రిని కోల్పోయిందని పేర్కొన్నారు.
India has lost a great writer. Bengal has lost a glorious mother. I have lost a personal guide. Mahashweta Di rest in peace
— Mamata Banerjee (@MamataOfficial) July 28, 2016