ధోనీ సేన స్ఫూర్తిగా: స్పీకర్, వెంకయ్యను స్కోర్ అడిగిన తృణమూల్ ఎంపీ
న్యూఢిల్లీ: సోమవారం నుండి పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం రాత్రి అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు తనతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుమిత్రా మహాజన్ లోకసభలోని వివిధ పక్షాల నాయకులతో సమావేశమై బడ్జెట్ సమావేశాలను సజావుగా జరపటం గురించి చర్చించారు.
భారత క్రికెట్ జట్టును ఆదర్శంగా తీసుకొని పార్లమెంటులో క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. నేటి మ్యాచ్లో (ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ గెలిచింది) వారు పూర్తి సమన్వయంతో, బాధ్యతాయుతంగా వ్యవహరించారని సుమిత్రా పేర్కొన్నారు. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. ప్రధాని మోడీ పాల్గొన్నారు.
కాగా, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నేటి ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్, 2015-16 సాధారణ బడ్జెట్తోపాటు మొత్తం 44 ఆర్థిక, ఆర్థికేతర అంశాలు చర్చకు రానున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం జారీ చేసిన ఆరు ఆర్డినెన్స్ల స్థానంలో ప్రతిపాదిస్తున్న బిల్లులకు పార్లమెంటు ఆమోదముద్ర పడటం ఎంతమాత్రం సులభం కాదు.
ప్రతిపక్షానికి రాజ్యసభలో మెజారిటీ ఉండటం వల్ల ఆరు బిల్లులను రాజ్యసభలో ఆమోదించటం ఎన్డీయే ప్రభుత్వానికి సాధ్యపడకపోవచ్చు. కాంగ్రెస్ సహకరించే పక్షంలో బీమా సవరణ బిల్లు పాస్ కావచ్చు. కానీ, భూసేకరణ బిల్లుకు మాత్రం మోక్షం లభించకపోవచ్చు.
క్రికెట్ స్కోర్ పైన...
దక్షిణాఫ్రికాతో భారత్ మ్యాచ్ సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓ బ్రియెన్ మధ్య స్కోర్ విషయమై సంభాషణ సాగింది. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో విపక్షాల సహకారం కోరేందుకు ఆయా పార్టీల నేతలకు వెంకయ్య విందు ఇచ్చారు. ఇది ఉల్లాసభరితంగా, చతురోక్తులతో కొనసాగింది.
తమ మధ్య ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టి నేతలు మాట్లాడుకున్నారు. వెంకయ్యను టీఎంసీ ఎంపీ స్కోర్ అడగగా.. ఆయన చెప్పారు. జమ్ము కాశ్మీర్ నుంచి రాజ్యసభకు మరోసారి గెలిచిన గులాం నబీ ఆజాద్ను వెంకయ్య అభినందించారు. మరోవైపు, తాము ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ చెప్పింది.
బిల్లులపై పట్టుబట్టండి: మోడీ
కేంద్ర ప్రభుత్వం చేపట్టదలచిన కీలక బిల్లులను శాసనాలుగా మార్చేందుకు పార్టీ ఎంపీలు గట్టి ప్రయత్నం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక శాసనాలను అమలు చేయడంపై ఎంపీలు ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఉద్ఘాటించారు. అలాగే, శాసనపరమైన వ్యవహారాలను లోపరహితంగా చేపట్టాలని, అర్థవంతమైన ఫలితాలు సాధించాలని కోరారు.