ఇక ‘సర్పంచ్ పతి’ సంస్కృతికి చరమ గీతం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: ఇక సర్పంచ్ భర్తల సంస్కృతి(సర్పంచ్ పతి) నశించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మహిళలు సర్పంచులుగా ఉంటే బాధ్యతనంతా వారే నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం(ఏప్రిల్ 24న) జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
మహిళలు సాధికారత సాధించాల్సి అవసరం ఉందని, ఆ వైపుగా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలకు చట్టం సమాన హక్కులు కల్పించిందని, వాటిని మనం గౌరవించాలని మోడీ అన్నారు.
‘గాంధీజీ దేశాభివృద్ధికి పల్లెలే పట్టుకొమ్మలన్నారు. ఆయన మాటలను మనం గౌరవించాలి. పల్లెల అభివృద్ధికి కృషి చేయాలి ప్రతి గ్రామం వచ్చే పదేళ్లలో ఏమేం సాధించాలో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని వాటి కోసం పని చేయాలి' అని పిలుపునిచ్చారు.
పల్లెల్లో బడి బయటి పిల్లలు ఎక్కువగా ఉండటం కలవరపెడుతోందని అన్నారు. వారందరినీ బడిలో చేర్పించేలా గ్రామీణులే నడుంబిగించాలని ప్రధాని అన్నారు. ప్రభుత్వ అధికారులు సక్రమంగా పనిచేసేలా పంచాయత్ సభ్యులు చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రధాని మోడీ 'ఈ- పంచాయితీ అవార్డు'లను ప్రదానం చేశారు. అవార్డులు గెలుచుకున్నజిల్లా పరిషత్, గ్రామ పంచాయతీలకు అభినందనలు తెలిపారు.