ఫేస్బుక్లో పోస్ట్, ఆత్మహత్య: తండ్రికి కూతురు విషం
చెన్నై: తాను ప్రణాలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్లో పోస్టు చేసిన యువకుడు అనంతరం అన్నంత పని చేశాడు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది. మధురై మంజనకారవీధికి చెందిన కూలి అబుదాహిర్ కుమారుడు షేక్ మహ్మద్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. దీపావళి రోజున తండ్రి, తల్లి, చెల్లాయి బంధువుల ఇంటికి వెళ్లారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న షేక్ మహ్మద్.. క్షమించండి, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అంటూ ఓ యువకుడు రక్తంతో రాసే ఫోటోను దీపావళి రాత్రి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్టుకు 28 మంది లైక్ కొట్టారు. మరుసటి రోజు స్నేహితులు ఫోన్ చేస్తే షేక్ మహ్మద్ ఫోన్ చేసినా ఎత్తలేదు.
ఆందోళనకు గురైన స్నేహితులకు చీరతో ఉరేసుకొని వేలాడుతున్న మహ్మద్ కనిపించాడు. కళాశాల ఫీజు కట్టలేకే షెక్ మహ్మద్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. షేక్ మహ్మద్ ఫేస్బుక్ పేజీలో తన పేరు పక్కన అన్ లక్కీ ఫెలో అని ట్యాగ్ లైన్ పెట్టుకోవడం గమనార్హం.
కామాంధుడైన తండ్రికి విషంపెట్టిన కూతురు
ప్రేమగా దగ్గరికి తీసుకోవాల్సిన తండ్రే తన కూతురిని నిత్యం లైంగికంగా వేధించేవాడు. ఆ వేధింపులను భరించలేని ఆ కూతురు తండ్రి తాగే మద్యంలో విషం కలిపింది. ఈ ఘటన తిరువారూర్ జిల్లా కీల్ అమరావతి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన రామరత్నం(44) మరో ముగ్గురు దేవేంద్రన్ (42), ఆనంద్(37), గజేంద్రన్(42) కలిసి దీపావళి రోజున ఓ బార్లో మద్యం సేవించారు.
తర్వాత అక్కడి నుంచి రామరత్నం ఇంటికి వెళ్లి అక్కడ మళ్లీ మద్యం తాగారు. సేవించిన కొద్దిసేపటికే ఆ నలుగురు స్పృహ కోల్పోయారు. స్థానికులు వారిని కుంభకోణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స ఫలించక గజేంద్రన్ మినహా మిగతా ముగ్గురూ మృతి చెందారు. అయితే, కల్తీ మద్యం తాగడం వల్లే వారు మృతి చెందారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సాయంత్రం బంధువులు రాస్తారోకో చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఉన్నతాధికారుల బృందం శవపరీక్ష చేయించింది.
మద్యంలో విషం కలవడం వల్లే వారు మృతి చెందినట్లు పోస్టుమార్టంలో తేలింది. దీంతో విచారణను ముమ్మరం చేయడంతో అసలు విషయం బయటపడింది. రామరత్నం కూతురే వారు తాగిన మద్యంలో విషం కలిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో శనివారం ఉదయం పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
అయితే, తండ్రి తనను నిత్యం లైంగికంగా వేధించేవాడని, ఆ నరకాన్ని భరించలేకే అతను తాగే మద్యంలో విషం కలిపానని ఆ బాలిక విచారణలో అంగీకరించింది. మిగిలిన వారు కూడా ఆ మద్యాన్ని సేవిస్తారన్న విషయం తనకు తెలియదని చెప్పింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మృతి చెందడంతో తాను కూడా బాధ పడుతున్నానని ఆ బాలిక కన్నీటిపర్యంతమైంది.