పీటలపై వరుడికి ప్రియురాలు చెంప దెబ్బలు: సోదరుడితో వధువు పెళ్లి
డెహ్రాడూన్: సినిమా తరహాలోనే హరిద్వార్లోని ఆవ్డిపుర్హాల్ గ్రామంలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతీయువకులు కొద్ది క్షణాల్లో భార్యాభర్తలుగా మారనున్న సమయంలోనే అక్కడికి వరుడి ప్రియురాలు వచ్చింది. ఇక్కడ వరుడిగా ఉన్న వ్యక్తికి తనతో ఇప్పటికే పెళ్లి అయిపోయిందని ఆమె చెప్పడంతో పెళ్లి ఆగిపోయింది.
అంతేగాక, పెళ్లికి వచ్చిన పెద్దలు, అతిథుల ముందే ఆమె వరుడిగా ఉన్న వ్యక్తిపై దాడి చేసి చెంపలు ఛెల్లుమణిపించింది. దీంతో వరుడు బంధువులు ఆమెను అడ్డుకున్నారు. వరుడిగా ఉన్న వ్యక్తితో తనకు కొన్నేళ్లుగా సంబంధం ఉందని, తామిద్దరికీ చట్టబద్ధంగా వివాహం కూడా అయిందని ఆమె తెలిపింది. మరో యువతితో వివాహం చేసుకుంటే తాను పోలీసులను ఆశ్రయించి అరెస్ట్ చేయిస్తానని హెచ్చరించింది.
దీంతో వరుడి కుటుంబసభ్యులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ పెళ్లి పీఠలపై ఉన్న వధువు తన మనసు మార్చుకుంది. తనకు అతనితో పెళ్లి ఇష్టం లేదని చెప్పిన వధువు, పెళ్లిని రద్దు చేయాల్సిందిగా కోరింది. ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది.
కాగా, పోలీసుల వద్దకు విషయాన్ని తీసుకుపోకుండా ఇరువర్గాల కుటుంబసభ్యులు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లారు. వధువు.. వరుడి సోదరుడిని వివాహం చేసుకోవాలని పంచాయతీ పెద్దలు చెప్పారు. దీనికి అంగీకరించిన ఇరుకుటుంబాల వారు వారి వివాహం చేశారు. ప్రియురాలిగా వచ్చిన మహిళతో మొదటి వరుడి వివాహం కూడా జరిగిపోయింది.