సాయంత్రం 6 గంటలకు జయలలిత గురించి ప్రకటన: ఏమిటో చెప్పని స్వామి
జయలలిత ఆరోగ్యం గురించి ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆరు గంటలకు ప్రకటన రావొచ్చునని రాజ్యసభ సభ్యులు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోగ్యం గురించి ఈ రోజు (సోమవారం) సాయంత్రం ఆరు గంటలకు ప్రకటన రావొచ్చునని రాజ్యసభ సభ్యులు, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. అయితే, జయలలిత గురించి ఏ ప్రకటన రాబోతుందనేది మాత్రం ఆయన చెప్పలేదు.
సాయంత్రం ఆరు గంటలకు అన్నాడీఎంకే నాయకులు చెన్నైలో భేటీ కానున్నారు. ఈ భేటీలో మధ్యంతర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా అవుతారనే ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
తాత్కాలికంగా వీసా పనుల నిలిపివేత
జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో చెన్నైలోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ కాన్సులేట్ అత్యవసర సందేశం జారీ చేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలిపింది.
ప్రస్తుతానికి ప్రజలు శాంతంగా ఉన్నా, ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక ప్రసార మాధ్యమాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ జాగ్రత్తలో మీరు ఉండాలని పర్యాటకులకు సూచించింది.
There may be a 6 PM announcement in JJ matter
— Subramanian Swamy (@Swamy39) December 5, 2016
యూఎస్ కాన్సులేట్ ప్రస్తుతం కొంతమంది సిబ్బందితోనే పనిచేస్తోంది. వీసా ప్రాసెసింగ్ పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, అవి పునరుద్ధరించిన అనంతరం ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని ప్రకటన జారీ చేసింది.