బర్ఖా సింగ్ వ్యవహారం: నిన్న వేటు.. నేడు బీజేపీలోకి, పార్టీ మారడం ఇంత వీజీయా?
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నుంచి సస్పెండైన మరుసటి రోజే ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ బీజేపీలో చేరారు.
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేసి, ఆ పార్టీ నుంచి సస్పెండైన మరుసటి రోజే ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ఖా శుక్లా సింగ్ బీజేపీలో చేరారు. శనివారం ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, పార్టీ ఢిల్లీ వ్యవహారాల ఇంఛార్జి శ్యామ్ జజును కలసి బీజేపీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలను ప్రశంసించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఆశించో లేక పార్టీలో పదవుల కోసమో తాను బీజేపీలో చేరలేదని చెప్పారు.
పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని బర్ఖా సింగ్ తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ మూడేళ్లలో దేశంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని ఆమె అన్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్పై తీవ్ర ఆరోపణలు చేసిన బర్ఖా సింగ్ను శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. రాహుల్కు పార్టీ నడపడం చేతకాదని, ఆయన పార్టీ అధ్యక్షపదవికి పనికిరారని, మానసికంగా ఆయన సరిగా లేరని విమర్శలు చేయడంతో ఆమెపై వేటు పడింది.