శశికళ సహా షాకిచ్చేలా, పన్నీరుసెల్వమే 'కీ'!: బీజేపీ స్టన్నింగ్ ప్లాన్
తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్కలయింది. ఆ తర్వాత మూడు, నాలుగు.. ఇలా గ్రూపులుగా విడిపోతున్నాయి.
చెన్నై: తమిళనాడులో అన్నాడీఎంకే రాజకీయం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తోంది. జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్కలయింది. ఆ తర్వాత మూడు, నాలుగు.. ఇలా గ్రూపులుగా విడిపోతున్నాయి.
అంతా నా భర్త వల్లే, చేయి దాటింది..: శశికళ ఆగ్రహం, మోడీతో యుద్ధమే!
ప్రధానంగా శశికళ, పన్నీరుసెల్వం వర్గాలు పట్టు కోసం పావులు కదుపుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి.. శశికళ కోరుకున్న సీఎం. ఆయన వెనుక చిన్నమ్మ ఉండి నడిపిస్తున్నారని.. కాదు కాదు, ఆమెకు దూరం జరుగుతున్నారనే వాదనలు ఉన్నాయి.
మాజీ సీఎం పన్నీరుసెల్వం వెనుక బీజేపీ ఉందనే వాదనలు ఉన్నాయి. కమలం బలంతోనే ఆయన చిన్నమ్మకు ధీటుగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. తాజాగా మరో అంశం వెలుగు చూస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించి బరిలోకి దిగనుందంటున్నారు.
పన్నీరు బీజేపీలో చేరుతారని..
పన్నీరుసెల్వం బీజేపీలో చేరుతారని, వచ్చే ఎన్నికల నాటికి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారనే ఊహాగానాలు తమిళనాట జరుగుతోంది.
శశికళ సహా షాకిచ్చేలా స్టన్నింగ్ ప్లాన్
తమిళనాట ప్రస్తుత పరిస్థితులను సాధ్యమైనంత వరకు క్యాష్ చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇందులో భాగంగా తొలుత రజనీకాంత్ కుదరకుంటే పన్నీరుసెల్వం, రెండూ కాకుంటే నిర్మలా సీతారామన్ను సీఎం అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో ప్రకటించే అవకాశాలపై ఢిల్లీలో చర్చ జరుగుతోందంటున్నారు. ఏమాత్రం బలం లేని బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి ఏకంగా సీఎం అభ్యర్థినే ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా చేయవచ్చునని అంటున్నారు.
రజనీకాంత్ దూరమే
సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం బీజేపీ ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన విషయంలో బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు మానడం లేదంటున్నారు.
బీజేపీ రికార్డ్ సృష్టిస్తుందా?
తమిళనాడులో ఇప్పటి వరకు జాతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. అధికారంలోకి వస్తే డీఎంకే లేదంటే అన్నాడీఎంకే. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత. బీజేపీ పరిస్థితి అంతకంటే దారుణం. అయితే, గత మూడేళ్లుగా బీజేపీ బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు స్థానం లేని బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకేలను ఢీకొట్టి వారిలో సగం సీట్లు సాధించినా రికార్డు సృష్టించినట్లే.
జయ మృతి తర్వాత...
2014లోనే మోడీ.. రజనీకాంత్ ద్వారా తమిళనాట పాగా వేయాలని ప్రయత్నించారు. కానీ అది నెరవేరలేదు. ఇప్పుడు జయలలిత మృతి తర్వాత బీజేపీ తమిళనాడుపై ప్రత్యేక దృష్టి సారించింది. దక్షిణాదిన బీజేపీకి పెద్దగా బలం లేదు. కర్నాటకలో గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలపైనా కమలం దృష్టి సారించింది. అయితే, దక్షిణాదిన కీలకమైన తమిళనాట ఎదిగేందుకు ఇదే సమయమని బీజేపీ భావిస్తోంది. అందుకే జయమృతి తర్వాత అన్నాడీఎంకే పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. ముందుకెళ్తోంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన ద్వారా..
అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు, చీలికలు ఉన్న ప్రస్తుత పరిస్థితిల్లో బీజేపీ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అన్నాడీఎంకేలోని పన్నీరు వర్గాన్ని ప్రోత్సహిస్తోందనే వాదనలు ఉన్నాయి. తద్వారా తమిళనాట చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ పేరు పరిశీలనలో ఉందట.
రజనీకాంత్పై వ్యూహాత్మక ఎత్తుగడలు.. షాకిస్తున్న సూపర్ స్టార్
రజనీకాంత్ను తొలుత తమ పార్టీ వైపు తీసుకు వచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఆయన మాత్రం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయాల పట్ల ఆయనకు ఆసక్తి లేకపోవడంతో.. వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా చేయాలనే చర్చ కూడా ఢిల్లీలో జరుగుతోందని అంటున్నారు. తద్వారా తమిళనాట సానుభూతి పొందాలని బీజేపీ భావిస్తోందని అంటున్నారు. కానీ రజనీకాంత్ నుంచి ఎలాంటి స్పందన లేదని తెలుస్తోంది. 2014లో మోడీ, ఆ తర్వాత వరుసగా బీజేపీ ఆయన కోసం ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన మాత్రం కమలం పార్టీకి షాకిస్తున్నారు.
పన్నీరుసెల్వం కోసం..
ఇప్పటికే పన్నీరుసెల్వం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి పన్నీరు గ్రూప్ను తమ పార్టీలో చేర్చుకొని, ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించే అంశాన్ని కూడా పరిశీలిస్తోందని తెలుస్తోంది.
అన్నాడీఎంకే, డీఎంకేలకు ధీటుగా..
తమిళనాట అన్నాడీఎంకే, డీఎంకేలకు ఉన్న పట్టు మరే పార్టీకి లేదు. ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ అంతగా ప్రభావం కనిపించదు. ఎలాగైనా డిఎంకేకు, అన్నాడీఎంకేలకు ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. రజనీకాంత్ మద్దతు లేదా పన్నీరు అండతో కనీసం ప్రతిపక్ష స్థాయికి లేదా డీఎంకే, అన్నాడీఎంకేలను గట్టిగా ఢీకొనే స్థాయికి ఎదగాలని కమలం నేతలు కోరుకుంటున్నారు.
2019 టార్గెట్.. 39లో 15 టార్గెట్
తమిళనాడులో 2021 వరకు అసెంబ్లీ ఎన్నికలు లేవు. 2019లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆ లోగా దక్షిణాది రాష్ట్రాల పైన గట్టి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమిళనాట 39 లోకసభ స్థానాలు ఉన్నాయి. పన్నీరు వర్గం లేదా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను క్యాష్ చేసుకుంటూ వెళ్లి వచ్చే లోకసభ ఎన్నికల్లో 39 స్థానాల్లో కనీసం 15 సీట్లను గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుందని తెలుస్తోంది. తమిళనాట ఇది బీజేపీకి అత్యాశే అవుతుంది. కానీ అన్నాడీఎంకేలోను పరిణామాలను బట్టి చూస్తుంటే... పన్నీరు జత కలిస్తే ఏమైనా జరగవచ్చునని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.