తమిళనాట సంచలనం: రాష్ట్ర సచివాలయంలో వెంకయ్య సమీక్షలు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తమిళనాడు సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో రాష్ట్ర పాలనలో కేంద్రమంత్రులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు అ
చెన్నై: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తమిళనాడు సచివాలయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇప్పుడు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ పరిణామం నేపథ్యంలో రాష్ట్ర పాలనలో కేంద్రమంత్రులు జోక్యం చేసుకుంటున్నారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఇందులో తప్పేముందంటూ పలువురు అధికార పార్టీ వర్గాలు వెంకయ్యకు మద్దతు పలకడం గమనార్హం.
జెండాలు, ఫొటోలు
వివరాల్లోకి వెళితే.. మెట్రో సొరంగ మార్గ రైలు ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రెండో రోజుల పర్యటన నిమిత్తం శనివారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. ఆదివారం ఉదయం మెట్రో రైలు ప్రారంభోత్సవం పూర్తి చేసుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకయ్య రావడంతో సాధారణంగానే అక్కడ బీజేపీ జెండాలు, వెంకయ్యతోపాటు ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమిచ్చాయి.
మిత్రపక్షాలయ్యాయా?..
అన్నానగర్లో పోటాపోటీగా అన్నాడీఎంకే, బీజేపీ జెండాలు ఎగిరాయి. పలువురు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలైపోయాయా? అనే అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే, ఆదివారం సాయంత్రం చెన్నై సచివాలయంలో అధికారులతో వెంకయ్యనాయుడు సమీక్షా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
చర్చకు దారితీసిన సచివాలయంలో సమీక్షలు
కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్ర్య నిర్మూలన, గృహవసతి, సమాచార, ప్రసాదర శాఖలు రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరుపై అధికారులతో వెంకయ్య ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కేంద్రమంత్రి రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఘటన రాష్ట్ర చరిత్రలోనే లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటోందని వెంకయ్యనాయుడు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
జయలలిత సీఎంగా ఉన్నంత కేంద్రం ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదని చెబుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంపై కేంద్రం పెత్తనం చెలాయిస్తుందని అంటున్నారు. కాగా, సచివాలయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమీక్ష సమావేశం నిర్వహిస్తే తప్పేంటని లోకసభ ఉపసభాపతి తంబిదురై వ్యాఖ్యానించడం గమనార్హం. తాను కూడా ఇతర రాష్ట్రాల్లో సమావేశాలు జరిపానని, వెంకయ్య సమావేశాన్ని స్వాగతిస్తున్నామని తంబిదురై స్పష్టం చేశారు.