19ఏళ్ల తర్వాత: ఫేస్బుక్ కలిపింది తండ్రీకొడుకుల్ని
లక్నో: అచ్చం సినిమాల్లోలానే ఇక్కడ చోటు చేసుకుంది. ఓ తండ్రి కొడుకులు 19ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అది కూడా సోషల్ మీడియా ఫేస్బుక్ సహాయంతో కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. 19ఏళ్ల క్రితం దూరమైన ఇద్దరు తండ్రి కొడుకులు ఫేస్బుక్ ద్వారా మళ్లీ కలుసుకున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గోరఖ్పూర్ గ్రామానికి చెందిన అక్తర్ అలామ్ అనే వ్యక్తి 1996 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో గత 19 సంవత్సరాలుగా అతని కుమారుడు బబ్లూ అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు.
అయితే ఇటీవల ఒక ఎన్జీవో( స్వచ్ఛంద సంస్థ) సంస్థ 70ఏళ్ల అక్తర్ ఫోటోని ఫేస్బుక్లో పోస్టు చేసింది. అది చూసిన బబ్లూ ఫేస్బుక్ సహాయంతో ఆ స్వచ్ఛంద సంస్థ వారి వివరాలు సేకరించి తద్వారా తన తండ్రిని కలుసుకోగలిగాడు.
తన తండ్రి చాలా కాలం తర్వాత కలవడం పట్ల ఆ కొడుకు సంతోషం వ్యక్తం చేశాడు. స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.