కొడుకు వ్యాధి నయం చేస్తానని.. తల్లిని నగ్నంగా మార్చి!: ఏడుసార్లు అత్యాచారం..
ఆపై తనతో శారీరకంగా కలిస్తే.. దోషం పోతుందని నమ్మబలికాడు. అమాయకురాలైన మహిళ.. ఇదంతా నిజమేననుకుని సదరు మహిళ అతనికి సహకరించింది.
బెంగళూరు: దేశంలో నకిలీ బాబాలు, స్వామిజీలు, జ్యోతిష్యుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. వారిని దైవాంశ సంభూతులుగా భావించే సామాన్య జనం.. అడిగినంతా సమర్పించుకుని ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా బెంగళూరులోని విజయనగర పరిధిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది.
విజయనగరలోని ఆర్పీసీ లేఔట్ కు చెందిన ఓ వివాహితకు(35) 10నెలల కొడుకు ఉన్నాడు. అయితే చిన్నారికి మూర్చ లక్షణాలు ఉండటంతో.. వ్యాధి నయం కోసం ఆమె పలువురిని సంప్రదించింది. దీంతో కనపురకు చెందిన ఓ జ్యోతిష్యుడు ఈ వ్యాధిని నయం చేయగలడని కొంతమంది ఆమెకు సలహా ఇచ్చారు.
వారి సలహా మేరకు విజయనగరలో ఉండే జ్యోతిష్యుడు ప్రసన్నకుమార్ అలియాస్ కార్తీక్ ను ఆమె ఆశ్రయించగా.. వ్యాధి నయం చేస్తానని చెప్పి ఆమెను నిలువునా దోచుకున్నాడు. 'నీ శరీరంలో శారీరక లోపం ఉండటం వల్లే.. బాబుకు ఇలాంటి వ్యాధి వచ్చింది' అని ఆమెను నమ్మించాడు. ఆ లోపాన్ని పోగొడుతానని చెప్పి.. ఆమెను నగ్నంగా మార్చి కొన్ని ఫోటోలు తీశాడు.
ఆపై తనతో శారీరకంగా కలిస్తే.. దోషం పోతుందని నమ్మబలికాడు. అమాయకురాలైన మహిళ.. ఇదంతా నిజమేననుకుని సదరు మహిళ అతనికి సహకరించింది. దీంతో ఏడుసార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు, బంగారం, నగదు వంటివి దానం చేస్తే వ్యాధి నయం అవుతుందని.. రెండు బంగారు నెక్లెస్ లు, రెండు చైన్స్, ఆరు చెవికమ్మలు, మూడు చేతి ఉంగరాలు కాజేశాడు.
బంగారంతో పాటు రూ.20లక్షల 70వేల నగదు కూడా దోచుకున్నాడు. ఆ తర్వాత నుంచి అతను అడ్రస్ లేకుండా పోవడంతో.. బాధితురాలు తాను మోసపోయానని గ్రహించింది. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సోమవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం, మోసం, కుట్ర, దోపిడీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇతగాడి చేతిలో ఇంకెవరైనా మహిళలు మోసపోయారా? అన్న కోణంలోను దర్యాప్తు కొనసాగుతోంది.